Begin typing your search above and press return to search.

ఎవ్వరినీ వదలొద్దు.. జగన్ స్పష్టమైన ఆదేశాలు!

By:  Tupaki Desk   |   10 July 2019 3:34 PM IST
ఎవ్వరినీ వదలొద్దు.. జగన్ స్పష్టమైన ఆదేశాలు!
X
అవినీతిని అన్ని రకాలుగానూ నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అవినీతి రహిత పాలన అని తొలి రోజే చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. ఆ సమయంలో కొందరు అది కేవలం పడికట్టు పదం, అది సాధ్యమా? అన్నట్టుగా రియాక్షన్లు ఇచ్చారు.

అయితే ముఖ్యమంత్రి మాత్రం ఆ విషయంలో పట్టు విడిచేలా కనిపించడం లేదు. తను పట్టిన పట్టు ఏదైనా దాన్ని వదిలే రకం కాదు జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే అది రుజువు అయ్యింది. ఇలాంటి నేఫథ్యంలో అవినీతి రహిత పాలనకు కూడా జగన్ కట్టుబడి ఉన్నట్టుగా కనిపించడం పెను సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా జగన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు అలాంటి వ్యవహారాల్లో తల దూర్చినా చర్యలు తప్పవని జగన్ తేల్చి చెప్పారు.

ఇక తాజాగా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా సీఎం అదే విషయాన్ని హైలెట్ చేయడం గమనార్హం. అవినీతిమయం అయిపోయిన వ్యవస్థలో పూర్తి మార్పు తీసుకురావాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులకు తేల్చి చెప్పారు.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పరిస్థితుల గురించి జగన్ ప్రస్తావించారు. లంచాలు లేకుండా అక్కడ ఏ పనులూ జరగడం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి చూపాలని ఆదేశించారు.

కేవలం అదొక్క శాఖ అని మాత్రమే కాకుండా.. అంతా అవినీతి రహితం కావాలని జగన్ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఫీసర్లు.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదని, మొత్తం వ్యవస్థను జల్లెడ పట్టి అవినీతి రహితంగా మార్చేలా చర్యలు ఉండాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.