Begin typing your search above and press return to search.

ఒక్క గెలుపుకే మిడిసిపడి భారత్ తో గొడవపడిన బంగ్లాదేశ్

By:  Tupaki Desk   |   10 Feb 2020 8:20 AM GMT
ఒక్క గెలుపుకే మిడిసిపడి భారత్ తో గొడవపడిన బంగ్లాదేశ్
X
క్రికెట్ అంటే జెంటిల్మన్ గేమ్.. ఇందులోంచే దేశం గర్వించే కపిల్, సచిన్, ధోని లాంటి మహామహులైన క్రికెటర్లు పుట్టుకొచ్చారు. ముఖ్యంగా ధోని లాంటి ఈ తరం కర్మయోగి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచకప్ ఫైనల్ అయినా లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి గెలిపించినా చిన్న టెన్షన్ కు గురికాకుండా.. అలాగే సంతోషపడని ధోని నిబ్బరాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి జెంటిల్మన్ గేమ్ క్రికెట్ లో బంగ్లాదేశ్ పాడు పనులతో అభాసుపాలు అవుతోంది.


తాజాగా ప్రపంచకప్ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగింది. రెండు జట్లు కొదమ సింహాల్లా పోరాడాయి. భారత్ కేవలం 177 పరుగులే చేసినా బంగ్లాదేశ్ ను ముప్పుతిప్పలు పెట్టింది. బంగ్లా కెప్టెన్ అక్బర్ పోరాడబట్టి సరిపోయింది. చివరి వరకూ తీసుకొచ్చిన భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని తగ్గించడంతో బంగ్లాదేశ్ సులువుగా గెలిచింది. వర్షం పడకపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.

అయితే చావు తప్పి గెలిచిన బంగ్లాదేశ్ అత్యుత్సాహం ప్రదర్శించింది. గెలిచిన ఆనందంలో మైదానంలో తిరుగుతూ భారత ఆటగాళ్లను అవమానించింది. బంగ్లా ఆటగాళ్లు భారత ఆటగాళ్లను గేలిచేశారు. భారత ఆటగాళ్ల పై బంగ్లా పేసర్ షోరిఫుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. భారత బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా బంగ్లా బౌలర్లు స్లెడ్జింగ్ చేశారు. బంగ్లా హసన్,భారత ఓపెనర్ సక్సేనా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అయితే రెండు జట్ల ఆటగాళ్లు 19 ఏళ్ల లోపు నవ యువకులు కావడం.. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడంలో విఫలమయ్యారు. మ్యాచ్ అయిపోయాక రెండు జట్ల ఆటగాళ్ల గొడవను గ్రౌండ్ సిబ్బంది వచ్చి విడదీసి పక్కకు తప్పించారు. దీంతో ఈ బీభత్సకాండ ప్రపంచ క్రికెట్ లో సంచలనమైంది. బంగ్లాదేశ్ క్రికెటర్ల వైఖరిపై అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే బంగ్లా ఆటగాళ్లు రెచ్చగొట్టినా భారత ఆటగాళ్లు సంయమనం పాటించి జెంటిల్మిన్ లా ప్రవర్తించారు.

బంగ్లాదేశీయులకు ఇలా ప్రవర్తించడం కొత్తమీ కాదు.. వారు గెలిచినప్పుడు ఓవర్ గా రియాక్ట్ అవుతుంటారు. ఓడినప్పుడు ఏడ్చేస్తుంటారు. బంగ్లా సీనియర్ జట్లు, ఇప్పుడు జూనియర్ జట్టు అంతే.. భారత్ ఎన్నోసార్లు ఈ జట్టును ఓడించింది. అయినా ఒక్కసారి గెలవగానే బంగ్లాదేశ్ బీరాలకు పోయింది. చింతచచ్చినా పులుపుచావని చందంగా బంగ్లా ప్రవర్తన ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

జాతీయ క్రికెట్ కు ఆడుతున్నప్పుడు కనీసం దేశ గౌరవం కాపాడాలన్న కనీస విజ్ఞత బంగ్లా క్రికెటర్లకు ఉండకపోవడం దారుణంగా ఉంది. వారు గెలిచి ప్రపంచ క్రికెట్లో ఓడి పోయారు. వారి ప్రవర్తనపై ఇప్పుడు మాజీ, ప్రస్తుత క్రికెటర్లంతా ఆడి పోసుకున్నారు. మ్యాచ్ గెలవడం కంటే అభిమానులు, క్రికెటర్ల మనసులు గెలవడమే ఏ జట్టుకైనా విలువ.. అలాంటి పనిని భారత్ చేసింది.. బంగ్లాదేశ్ అభాసుపాలైంది..