Begin typing your search above and press return to search.

తెలుగుదేశం ఎమ్మెల్యేల యుద్ధం: ఉద్రిక్తత

By:  Tupaki Desk   |   27 Oct 2015 3:52 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యేల యుద్ధం: ఉద్రిక్తత
X
అనంతపురం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి కొట్లాట వరకు వెళ్తున్నాయి. ప్రధానంగా జిల్లాలోని ఇద్దరు ప్రభాకర్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు ముదరడంతో ప్రస్తుతం ఆ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి మధ్య కొద్దికాలంగా విభేదాలు తీవ్రమైన సంగతి తెలిసిందే. అనంతపురంలో గాంధీ విగ్రహం ఏర్పాటు అంశంలో ఇద్దరి మధ్యా వివాదమేర్పడి అది రోజురోజుకీ ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకరచౌదరి ఇంటిపైకి జేసీ ప్రభాకరరెడ్డి వర్గీయులు దాడికి వస్తున్నారని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. దీంతో పోలీసులు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా పెద్ద సంఖ్యలో మోహరించారు. చౌదరి ఇంటివద్ద బందోబస్తు పెట్టారు.

అయితే, ఇంతకీ జేసీ వర్గీయులు దాడికి వస్తున్నారో లేదో తెలియదు కానీ ప్రభాకర చౌదరి మాత్రం తనకెలాంటి బందోబస్తు వద్దని... ఎవరొచ్చినా తానొక్కడినే ఎదుర్కొంటానని అంటున్నారు. నాకేం భయం లేదు.. మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి అంటూ ఆయన పోలీసులకు చెప్పినా వారు మాత్రం ముందుజాగ్రత్తగా అక్కడే ఉన్నారు. ఒకే పార్టీ ఎమ్మెల్యేలు ఇలా దండయాత్రలు చేసుకోవడం ఏమిటో..?