Begin typing your search above and press return to search.

పౌరసత్వ సవరణ బిల్లు: కేంద్రానికి బిగ్ షాక్

By:  Tupaki Desk   |   14 Dec 2019 7:14 AM GMT
పౌరసత్వ సవరణ బిల్లు: కేంద్రానికి బిగ్ షాక్
X
కేంద్రంలో అధికారం ఉంది.. కావాల్సినంత మెజార్టీ ఎంపీలున్నారు. ఏదీ చేసినా నడుస్తుందని భావించిన బీజేపీ సర్కారుకు రాష్ట్రాలు షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (క్యాబ్)ను పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి.

కేంద్రం ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దమని.. ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసే ప్రసక్తే లేదని తాజాగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా మరో రెండో స్వాతంత్య్ర సమరాన్ని చేస్తామని బెంగాల్ సీఎం మమత ప్రకటించారు. ఈ చట్టాన్ని బెంగాల్ లో అమలు చేయనివ్వమని ప్రతినబూనారు. బీజేపీ దేశాన్ని మతప్రాదిపదికన విభజిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ లో బలం ఉంది కదా అని బలవంతంగా బిల్లులు ఆమోదించి దేశాన్ని విడగొట్టలేరని మమత దుయ్యబట్టారు.

ఇక పంజాబ్ సీఎం కూడా ఇది భారత లౌకికత్వంపై దాడి అని మండిపడ్డారు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, కేరళ సీఎంలు ఈ బిల్లును వ్యతిరేకించారు.

ఇక దీనిపై కేంద్ర హోంశాఖ కూడా స్పందించి ఈ చట్టాన్ని అమలుచేయబోమని చెప్పే అధికారం రాష్ట్రాలకు లేదని.. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ లో భాగమైన కేంద్ర జాబితాలో ఈ చట్టం ఉందని పేర్కొంది. ఏడో షెడ్యుల్ లో రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వే, పౌరసత్వం సహా 91 అంశాలు కేంద్రం పరిధిలో ఉంటాయని పేర్కొంది.

ఇక పౌరసత్వ సవరణ బిల్లును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కూడా పలు పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో కేంద్రంలోని బీజేపీకి చట్టాన్ని ఆమోదించినా అమలు అవుతుందా లేదా అన్న టెన్షన్ పట్టుకుంది. దేశవ్యాప్తంగా వ్యతిరేకతతో బీజేపీకి బిగ్ షాక్ తగులుతోంది.