Begin typing your search above and press return to search.

రైల్లో సిగిరెట్.. లైట్ తీసుకుంటే నేరుగా జైలుకే

By:  Tupaki Desk   |   21 March 2021 6:48 AM GMT
రైల్లో సిగిరెట్.. లైట్ తీసుకుంటే నేరుగా జైలుకే
X
సిగిరెట్ అని సింపుల్ గా తీసుకోమాకండి. చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. ఏదోలా ఒక్క పఫ్ గట్టిగా పీలిస్తే కానీ స్థిమితపడని ఎంతోమందిని మన చుట్టూ చూస్తుంటాం. అలాంటిది గంటల కొద్దీ ప్రయాణించే వేళ.. సిగిరెట్ ముట్టిస్తే చాలు మొదటికే మోసం వచ్చే పరిస్థితి. ఇటీవల చోటు చేసుకుంటునన రైల్వే అగ్నిప్రమాదాల్లో ఎక్కువగా సిగిరెట్ ను కారణంగా గుర్తించారు. దీంతో.. సిగిరెట్.. బీడీలాంటి వాటిని రైళ్లలో వినియోగించే విషయం మీద కేంద్రం సంచలన నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఈ నెల 13న న్యూదిల్లీ -డెహ్రాదూన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఎస్-5 బోగీలో మంటలు చెలరేగటం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి టాయిటెల్ డస్ట్ బిన్ లో కాలుతున్న సిగిరెట్ ను వేయటం.. అందులోని టిష్యూ పేపర్లకు అంటుకోవటం భారీ అగ్నిప్రమాదానికి కారణమైందని గుర్తించారు.

ఈ నేపథ్యంలో రైళ్లల్లో ఇకపై పొగతాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ భావిస్తున్నట్లు చెబుతున్నారు. రైల్వేల ఆస్తులకు నష్టం వాటిల్లే వేళలో.. తోటి ప్రయాణికుల ప్రాణాల్ని పణంగా పెట్టే వ్యక్తుల్ని అరెస్టు చేసే అంశంపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోంది. ఇప్పటివరకు రైళ్లలో పొగతాగితే రూ.100 జరిమానా వేస్తున్నారు. అందుకు భిన్నంగా ఇకపై అరెస్టు చేయాలన్న మార్పుతో చట్టాన్ని రూపొందించే వీలుందన్న మాట వినిపిస్తోంది.