Begin typing your search above and press return to search.

ఆ స్కాంల వెనుక లోకేష్ ఉన్నాడట!!

By:  Tupaki Desk   |   14 Sep 2016 8:00 AM GMT
ఆ స్కాంల వెనుక లోకేష్ ఉన్నాడట!!
X
క‌రువునేల‌కు నీరందించేదుకు తాము ఎంచుకున్న అత్యుత్త‌మ మార్గం రెయిన్‌ గన్లు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్ర‌చారంపై అవినీతి ఆరోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. అందులో సాక్షాత్తు చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ఉన్న‌ట్లు ప్ర‌తిపక్షాలు విమ‌ర్శలు మొద‌లుపెట్టాయి. రెయిన్‌ గ‌న్ల కొనుగోలు - చంద్రన్న కానుక వంటి పనుల్లో లోకేష్‌ కోట్ల రూపాయలు వెనుకేసుకున్నారని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా తయారైందని, పేదలను మభ్యపెట్టే దిశగా పథకాలు ప్రారంభించి, వాటికి కోట్ల రూపాయలతో ప్రచారం చేయడానికే - జేబులు నింపుకోవ‌డానికే పరిమితమ‌య్యార‌ని చింతామోహ‌న్ విమర్శించారు.

తాను నిప్పులాంటి మనిషినని - ఆ రకంగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పాలనలో జరుగుతున్న అవినీతిని గుర్తించకపోవడం హాస్యాస్పదమ‌ని చింతామోహ‌న్‌ అన్నారు. పంటలు కాపాడుతామని రెయిన్‌ గన్లు రైతుల చేతికి ఇవ్వడం సరైన చర్య కాదని చెప్పారు. ఇదిలాఉండ‌గా.. రాష్ట్రానికి తక్షణం ప్రత్యేక హోదా అవసరమని - ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఉపయోగం లేదన్నారు.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చింతామోహన్‌ డిమాండ్‌ చేశారు. సంక్షేమ పథకాలు - ఇతర రాయితీ - పేదల అభివృద్ధి - యువతకు ఉద్యోగాలు ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సులువుగా సాధించవచ్చునన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు టీ - కాఫీలు తాగాలన్నా కూడా హెలికాప్టర్లను వాడుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చింతామోహ‌న్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లా పరిధిలోని దుగ్గరాజుపట్నం ఓడరేవును ప్రైవేటు పరం చేసేందుకు కుట్రపన్నుతున్నారని, ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు - వెంకయ్యనాయుడు పాత్ర ఎక్కువగా ఉందని ఆరోపించారు. ప్రైవేటు పరం చేస్తే తమ పార్టీ తరఫున పెద్దఎత్తున మహాసభ ఏర్పాటు చేసి ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామన్నారు. ఎస్సీలు - నిరుపేదలు అధికంగా ఉండే సత్యవేడు నియోజకవర్గంలో చిన్నచిన్న ఉద్యోగాలను కూడా కొందరు విక్రయించుకుని పబ్బం గడుపుకుంటున్నారని మాజీ ఎంపీ మండి పడ్డారు.

ఇదిలాఉండ‌గా రెయిన్‌ గన్ల‌లో రూ.208 కోట్లు అవినీతి జరిగిందని వస్తున్న వార్తలను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రం గా ఖండించారు. రెయిన్‌ గన్ల‌కు ప్రభుత్వం రూ.115 కోట్లే ఖర్చు చేసిందని చెప్పారు. 115 కోట్లు ఖర్చు చేస్తే 208 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ పది రోజుల ముందే రెయిన్‌ గన్లు అందుబాటులో ఉంచితే మరిన్ని పంటలు కాపాడే అవకాశం ఉండేదని, కానీ ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లడం వల్ల ఆలస్యం అయిందని తెలిపారు. కోర్టుకు వెళ్లడం వెనుక ఉన్న కుట్రను బయటకు తీస్తామని చెప్పారు.