Begin typing your search above and press return to search.

నమ్మండి ప్లీజ్...ఆ ఇద్దరి రచ్చ వెనుక జగన్

By:  Tupaki Desk   |   7 July 2017 7:19 AM GMT
నమ్మండి ప్లీజ్...ఆ ఇద్దరి రచ్చ వెనుక జగన్
X
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ తీరును నిరసిస్తూ త‌మ సామాజిక‌వ‌ర్గానికి న్యాయం కోరుతూ ప‌లు సంఘాలు రోడ్డెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌ముఖంగా కాపుల‌కు బీసీ కోటా కోసం గ‌ళ‌మెత్తుతున్న మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం - మాదిగ రిజ‌ర్వేష‌న్‌ పోరాట స‌మితి వ్య‌వ‌స్థాప‌కుడు మంద‌కృష్ణ మాదిగ‌ను చెప్పుకోవ‌చ్చు. ఈ ఇద్ద‌రు తమ‌ త‌మ పంథాలో చంద్రబాబు స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ సామాజిక‌వ‌ర్గానికి న్యాయం చేయ‌మ‌ని కోరుతున్న ఈ ఇద్ద‌రి వెనుక ఉంది ఏపీ విప‌క్ష నేత - వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి అట‌. అవునా? అని ఆశ్చ‌ర్య‌పోకండి. సాక్షాత్తు ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు మ‌రి!

వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్‌ లో విలేకరులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రభుత్వ అనుమతి లేని సభలు - పాదయాత్రలు ఎట్టిపరిస్థితిల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తుల్ని అణచి వేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగానే ముద్రగడ - మంద కృష్ణలను ప్రతిపక్షనేత జగన్‌ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ చేపట్టిన కురుక్షేత్రం కార్యక్రమానికి ప్రభుత్వం ఎటువంటి అనుమతివ్వలేదని హోంమంత్రి చిన‌రాజ‌ప్ప‌ తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీకి చెందిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు వారి సమస్యల్ని తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు కోరుతున్న ముద్రగడ పద్మనాభం సైతం త‌న పంథా మార్చుకోవాల‌ని చిన‌రాజ‌ప్ప కోరారు. ఆయ‌న నిర్వహించే చ‌లో అమరావతి' అనుమతి కోసం ప్రభుత్వాన్ని కోరలేదన్నారు. అడగకుండా అనుమతివ్వాలని ముద్రగడ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ నివేదిక వచ్చిన వెంటనే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మంజునాథపై నమ్మకం లేదంటూ ముద్రగడ చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ప్ర‌భుత్వ ప‌రంగా జ‌రుగుతున్న ప్ర‌క్రియ‌పై న‌మ్మ‌కం లేక‌పోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.