Begin typing your search above and press return to search.

చిన‌జీయ‌ర్ కామెంట్‌: దేవుడి సేవ‌లో కేసీఆర్ ఫ‌స్ట్‌

By:  Tupaki Desk   |   14 Oct 2017 4:29 AM GMT
చిన‌జీయ‌ర్ కామెంట్‌: దేవుడి సేవ‌లో కేసీఆర్ ఫ‌స్ట్‌
X
జీయ‌ర్ సంస్థ‌ల అధినేత చిన‌జీయ‌ర్ స్వామి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ఓ రేంజ్‌ లో పొగిడేశారు. ఆయ‌న భ‌క్తి భావ‌మే తెలంగాణ‌ను న‌డిపిస్తోంద‌ని త‌న‌దైన శైలిలో పొగ‌డ్త‌లు కురిపించారు. ఎప్పుడు రాముడు - దేవుడు అంటూ ప్ర‌వ‌చ‌నాలు చేసే స్వామి ఒక్క‌సారిగా ఫ‌క్తు రాజ‌కీయ నేత‌గా మారారా? అనే రేంజ్‌ లో కేసీఆర్‌ ను పొగిడేశారు. విష‌యంలోకి వెళ్తే.. స‌ర్వ‌సంఘ‌పరిత్యాగులైన సాధువుల‌కు - రాజ‌కీయ నేత‌ల‌కు క‌డు దూరం- ఇది ఒక‌ప్ప‌టి మాట‌! నేడు ప‌రిస్థితి మారిపోయింది. రాజ‌కీయాలు - రాజ‌కీయ నాయ‌కులు.. సాధువులు - స‌న్యాసులు - మ‌ఠాల చుట్టూతానే తిరుగుతున్నారు!! రాజ‌కీయాల‌కు-స్వాముల‌కు విడ‌దీయ‌రాని బంధం ఏర్ప‌డిపోతోంది. ఇప్ప‌టికే దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు ఓ స‌న్యాసి ముఖ్య‌మంత్రిగా ఉండ‌డం దీనికి ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ‌.

ఇక‌, తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లోనూ సాధువుల‌కు - స‌న్యాసుల‌కు రాజ‌కీయ నేత‌ల‌తో ఉన్న సంబంధ బాంధ్య‌వ్యాలు త‌క్కువేమీ కావు. సీఎం కేసీఆర్ ప్ర‌తి నెలా త‌న‌కు అత్యంత ఆప్తుడైన చిన‌జీయ‌ర్ స్వామిని ఏదో ఒక స‌మ‌యంలో క‌లుస్తూనే ఉంటారు. రాష్ట్ర ప‌రిస్థితులపై ఆయ‌న‌తో చ‌ర్చిస్తారు. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక‌, కేసీఆర్‌ లో ఉన్న ఆధ్యాత్మిక భావ‌న‌ల నేప‌థ్యంలో చిన జీయ‌ర్‌ కు ఆయ‌న‌కు మ‌ధ్య ఈ బంధం మ‌రింత ద్రుఢ‌ప‌డింది. జీయ‌ర్ సూచ‌న‌ల మేర‌కే గ‌తంలో య‌జ్ఞ‌యాగాలు నిర్వ‌హించారు. అధికారంలోకి వ‌చ్చాక కూడా భారీ ఎత్తున చండీయాగం నిర్వ‌హించారు. ఇక‌, తెలంగాణ‌లోని యాద‌గిరి గుట్ట‌ను యాదిద్రిగా పేరు మార్చి దాదాపు స‌మీపంలోని అన్ని గుట్ట‌ల‌ను చేర్చి.. మ‌రో తిరుమ‌ల మాదిరిగా తీర్చిదిద్దే బృహ‌త్ ప్ర‌ణాళిక‌ను సైతం సిద్ధం చేసి.. ఇప్ప‌టికే అమ‌లు కూడా ప్రారంభించారు.

ఏటా రాష్ట్ర బ‌డ్జెట్ నుంచి రూ.100 కోట్లు కూడా కేటాయిస్తున్నారు. ఈ మొత్తం తతంగం వెనుక నిస్సందేహంగా జీయ‌ర్ స్వామి ఉన్నారని అంద‌రికీ తెలిసిందే. అదేవిధంగా యాదాద్రికి కేసీఆర్ ఎప్పుడు వెళ్లినా ఆయ‌న వెంట హెలీకాప్ట‌ర్‌ లో జీయ‌ర్ ఉండాల్సిందే. అలా ఈ జీయ‌ర్ స్వామికి - కేసీఆర్‌ కు మ‌ధ్య ఫెవికాల్ బంధాన్ని మించిన అనుబంధం ద్రుఢంగా ఏర్ప‌డి పోయింది. మ‌రోప‌క్క‌, జీయ‌ర్ స్వామి త‌ల‌పెట్టిన రామానుజల 216 అడుగుల ఎత్త‌యిన విగ్ర‌హ ఏర్పాటుకు కేసీఆర్ `చాలా సాయం` చేస్తున్న‌దీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జీయ‌ర్ స్వామి కేసీఆర్‌ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. దేవుళ్ల సొత్తు తినే ట్రెండ్ కు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారని స్వామీజీ కొనియాడారు.

భద్రాచలంలోని రామాలయాన్ని ద‌ర్శించిన స్వామి అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా దేవుడి సేవ చేస్తూ కేసీఆర్ ముందున్నారని ఆకాశానికి ఎత్తేశారు. యాదాద్రి తరహాలో భద్రాచలం అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ ను, మంత్రి తుమ్మలను చినజీయర్ స్వామి ఆశీర్వదించారు. వానలు - కురిసి పంటలు పండి - రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే దేవుడి సేవ చేయాలని ఈ సందర్భంగా స్వామీజీ సూచించారు. దీంతో జీయ‌ర్ వ్యాఖ్య‌లపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేగింది. అదేంటి స్వామి ఓ రాష్ట్ర సీఎంను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.. అని విశ్లేష‌కులు నోళ్లు నొక్కుకున్నారు. ఏమైనా.. ప్ర‌స్తుత కాలానికి అనుగుణంగా స్వాములు స్వామీజీలు మారిపోతున్నారు.