Begin typing your search above and press return to search.

చినజీయర్ తో చెడింది.. కేసీఆర్ సర్కార్ కేసు పెట్టేసింది..?

By:  Tupaki Desk   |   27 Jun 2022 9:30 AM GMT
చినజీయర్ తో చెడింది.. కేసీఆర్ సర్కార్ కేసు పెట్టేసింది..?
X
చినజీయర్ స్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్ చెడిందని జోరుగా వార్తలు వచ్చాయి. సమతామూర్తి విగ్రమాన్ని మోడీతో ఆవిష్కరింపచేసి కేసీఆర్ పేరును కూడా శిలాఫలకంలో పెట్టకపోవడంతో కేసీఆర్ అలిగారని.. అప్పటి నుంచే చినజీయర్ ను దూరం పెట్టారని ప్రచారం సాగింది. చాలా రోజులు ఎడమొహం పెడమొహంగా ఉన్న వీరిద్దరూ మాట్లాడుకోలేదని టాక్. ఒకప్పుడు చినజీయర్ పై ఈగ వాలనీయని కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఏకంగా కేసులు పెట్టేవరకూ వెళ్లడం చర్చనీయాంశమైంది.

సమతామూర్తి విగ్రహం ప్రారంభం నుంచి చినజీయర్ స్వామికి చిక్కులు ఎదురవుతున్నాయి. ‘స్ట్రాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహం పెట్టి వందల ఎకరాల్లో చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సమాతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు పలువురు భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. మొదట్లో ఉచితంగానే ప్రవేశం కల్పించిన నిర్వాహకులు ఆ తరువాత నిర్ణీత రుసుముతో లోనికి అనుమతినిస్తున్నారు.

అయితే డబ్బులు పెట్టి మరీ లోపలికి వస్తున్నా.. తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని కొందరు ఇప్పటికే ఆరోపణలు చేశారు. తాజాగా ఓ భక్తుడు తమకు ఇచ్చే ప్రసాదం.. నాణ్యమైనది కాకపోవడంతో పాటు ఇందులో అవకతవకలున్నాయని తూనికలు, కొలతల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

వినయ్ వంగాల అనే వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు వచ్చారు. విగ్రహ దర్శనం అనంతరం అక్కడ విక్రయించే ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ ప్రసాదం కవర్ పై కాలపరిమితి ముద్రించలేదు. అంతేకాకుండా కవర్ పై ఉన్న బరువుకు.. లోపలున్న ప్రసాదం బరువుకు తేడా అనిపించింది. దీంతో అక్కడున్న సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పారు. వారు స్పందించలేదు. వెంటనే ఆయన మెయిల్ ద్వారా తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు ఆశ్రమానికి వచ్చి తనిఖీ చేశారు.

ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు చినజీయర్ ఆశ్రమానికి వచ్చారు. ఆ తరువాత ప్రసాదాన్ని తనిఖీ చేశారు. వినయ్ వంగాల ఫిర్యాదు నిజమేనని తేలడంతో మెట్రాలజీ యాక్ట్ 2009 10,11,12 అండ్ 8/25 సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని వినయ్ మీడియాకు తెలిపారు. అయితే సాధారణంగా ప్రతీ ఆలయంలో సూచించిన బరువు ప్రకారం లడ్డూ ఉండకపోవచ్చు. అయితే ఈ విషయాన్ని అటు ఆలయ అధికారులు, ఇటు భక్తులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ భక్తుడు దీనీని పెద్ద ఇష్యూ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అదీ గాక ఒక భక్తుడు చేసిన ఫిర్యాదును తూనికలు, కొలతల అధికారులు ఇంత సీరియస్ గా తీసుకోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సమతామూర్తి ఆశ్రమంలోని లోపాలను ఎత్తి చూపేందుకే వినయ్ వచ్చాడా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వినయ్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. అయితే చినజీయర్ ఆశ్రమంపై కొన్ని నెలలుగా విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా సమతామూర్తి విగ్రహం ప్రారంభం నుంచి చినజీయర్ స్వామి పలు వివాదాల్లోచిక్కుకుంటున్నారు. 20 ఏళ్ల కిందట సమ్మక్క సారలక్కలపై చేసిన వ్యాఖ్యల వీడియో ఇటీవల వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా వరుసగా చినజీయర్ పై వ్యతిరేకంగా సంఘటనలు జరగడం భక్తులను తీవ్ర నిరాశకు కలిగినిస్తుంది.