Begin typing your search above and press return to search.

చైనా దీమాః మేం లేక‌పోతే భార‌త్‌ కు చుక్క‌లే

By:  Tupaki Desk   |   29 March 2017 11:54 AM GMT
చైనా దీమాః మేం లేక‌పోతే భార‌త్‌ కు చుక్క‌లే
X
త‌మ‌తో స‌మానంగా ఎద‌గ‌డాన్ని జీర్ణించుకోలేక పోవ‌డ‌మో, పొరుగునే ఉండ‌టం కార‌ణ‌మో తెలియ‌దు కానీ...భార‌త‌దేశంలో జ‌రిగే ప‌రిణామాల‌న్నింటిపై చైనా తెగ ఆస‌క్తి చూపిస్తుంటుంది. అంత‌ర్జాతీయ నిర్ణ‌యాల విష‌యంలో చైనా త‌న అభిప్రాయాలు చెపితే అభ్యంత‌రం లేదు కానీ ఆ ప‌రిధిని దాటుకొని మ‌న విధానప‌ర‌మైన నిర్ణ‌యాల‌పై కూడా చైనా క‌న్నేస్తోంది. అంతేకాకుండా త‌న‌దైన శైలిలో బెదిరింపు రాజ‌కీయాల‌కు దిగుతోంది. ఇదంతా హై-స్పీడ్‌ ట్రైన్‌ ప్రాజెక్టుల్లో చైనా అక్క‌సు గురించి.

ఉగ్ర‌వాదం విష‌యంలో భార‌త్‌ ను ఇర‌కాటంలో పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం, దేశ స‌రిహ‌ద్దులో ఒప్పందాల ఉల్లంఘ‌న‌, పాక్‌ తో దోస్తీ క‌ట్ట‌డం, అంత‌ర్జాతీయ వేదిక‌ల్లో భార‌త్‌ ను ప‌లుచన చేయ‌డం వంటి కార‌ణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంలోకి చైనాను అనుమతించకుండా నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై చైనా ప్రభుత్వ మీడియా 'గ్లోబల్‌ టైమ్స్‌' ఎడిటోరియల్ బెదిరింపుల‌కు పాల్ప‌డింది. చైనాను పక్కన పెట్టడం భారత్‌ కే నష్టం తీసుకొస్తుందని హెచ్చ‌రించింది. `హై-స్పీడ్‌ ట్రైన్లు కావాలనుకున్నప్పుడు దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే రక్షణాత్మక ఆర్థిక ధోరణులను భారత్‌ కలిగి ఉండకూడదు. ఉక్కు రైళ్ల తయారీ, రైళ్ల సాంకేతికలో చైనాకు భారత్‌ అవసరం కంటే, భారత్‌ కు చైనా అవసరమే ఎక్కువ. ఈ విష‌యం భార‌త్ గ‌మ‌నించుకోవాలి` అని గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది.

దేశంలో చేప‌ట్టనున్న‌ హై-స్పీడ్‌ రైల్వే ప్రాజెక్టులో భారత్‌ జపాన్‌ను తన భాగస్వామిగా ఎంచుకొని చైనాను పక్కనపెట్టింది. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 నుంచి ఈ ప్రాజెక్టు భారత్‌ లో ప్రారంభకాబోతుంది. ఆర్థిక వ్యవస్థలో కొత్త పేరుని సొంతం చేసుకోవడానికి చైనా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్‌ రైల్‌ టెక్నాలజీ ఎగుమతులను శరవేగంగా పెంచుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/