Begin typing your search above and press return to search.

చైనా కీలక నిర్ణయం ..తెరపైకి సరిహద్దు చట్టం

By:  Tupaki Desk   |   25 Oct 2021 3:30 PM GMT
చైనా కీలక నిర్ణయం ..తెరపైకి  సరిహద్దు చట్టం
X
భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరో ఎత్తుగడతో ముందుకి వచ్చింది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సరిహద్దుల్లో చైనా ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు ఆ చట్టంలో డ్రాగన్‌ వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు తెలిపింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది.

డ్రాగన్‌ తీసుకొచ్చిన తాజా చట్టం భారత్తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం శనివారం ముగిసింది. కాగా ఈ సమావేశంలోనే నూతన చట్టానికి ఆమోదం తెలిపినట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది. కాగా ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపులు అనే సూత్రాల ద్వారా సరిహద్దు వ్యవహారాలను నిర్వహించనున్నట్లు చట్టంలో చైనా పేర్కొంది.

చర్చలతోనే పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించుకుంటామని వెల్లడించింది. 12 పొరుగు దేశాలతో చైనా సరిహద్దును నిర్ణయించుకున్నప్పటికీ, భారత్, భూటాన్ తో మాత్రం ఆ దేశానికి సరైన సరిహద్దు లేదు. దీంతో భారత్, భూటాన్ దేశాలతో డ్రాగన్‌ కు ఎప్పటినుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. భారత్ తో 3,488 కిలోమీటర్లు, భూటాన్తో 400 కిలో మీటర్ల మేర సరిహద్దు వివాదాస్పదంగా ఉంది. లద్దాఖ్‌ లోని భారత భూభాగంలోని పలు ప్రాంతాల్లో చైనా సైన్యం ఇప్పటికే పాగా వేసినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తాజా చట్టంతో మరిన్ని ఆక్రమణలు జరిగే అవకాశాలు ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి.