Begin typing your search above and press return to search.

గత ఏప్రిల్ లోనే కరోనా వ్యాక్సిన్ సిద్ధం .. చైనా కీలక ప్రకటన !

By:  Tupaki Desk   |   15 Sep 2020 3:00 PM GMT
గత ఏప్రిల్ లోనే కరోనా వ్యాక్సిన్ సిద్ధం .. చైనా కీలక ప్రకటన !
X
కరోనా మహమ్మారి .. గత తొమ్మిది నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది. ఇప్పటి వరకు 9.3లక్షల మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3కోట్లకు చేరువైంది. రోజులు గడుస్తున్నకొద్దీ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్ సహా అగ్రదేశాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా వెలుగులోకి వచ్చిన చైనా సైతం వ్యాక్సిన్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. డ్రాగన్ దేశం కావాలనే కరోనాను సృష్టించిందనే ఆరోపణల నడుమ వ్యాక్సిన్ కు సంబంధించి ప్రభుత్వం సంచలన ప్రకటనలు చేసింది.కరోనాపై మొదటి నుంచీ తప్పుడు సమాచారం ఇస్తూ ప్రపంచాన్నిఆగంపట్టించిన చైనా.. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో కూడా అదే విధంగా ముందుకుపోతుంది.

చైనీస్ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేసిన నాలుగు వ్యాక్సిన్‌లు చివరి దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయని, తాజాగా వీటిలో మూడు టీకాలు నవంబర్‌ నాటికి ప్రజలందరూ వాడటానికి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వ ఆధీనంలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ బయోసేఫ్టీ నిపుణులు గైఝెన్‌ వూ తెలిపారు. అంతటితో ఆగకుండా, గత ఏప్రిల్‌ నాటికే కరోనా వ్యాక్సిన్ తయారు చేశామని, తాను కూడా డోసు తీసుకున్నానని ఆమె చెప్పడంతో మరో కొత్త రచ్చ ప్రారంభం అయింది. ఇదే కనుక నిజమైతే .., ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ చైనాదే కావాలి, కానీ ఆ విషయాన్ని ఇన్ని నెలలు దాచి ఉంచడం వెనుక ఇంకేదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, నాలుగు వ్యాక్సిన్‌లలో ఏ వ్యాక్సిన్‌ను తీసుకున్నారో చెప్పలేదు.

ఒక్కసారి వ్యాక్సిన్ విడుదలైన తర్వాత ఎన్నో పేదదేశాలు దానిని వాడే అవకాశం ఉన్నందున చైనా తయారీ వ్యాక్సిన్లపై అనుమానాలు పెరుగుతున్నాయి. యూరప్, అమెరికా సహా ఆసియాలోని ఇతర దేశాలు వ్యాక్సిన్ తయారీలో జాగ్రత్తలు పాటిస్తూ, శాస్త్రీయంగా క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తైన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెబుతుండగా, చైనా మాత్రం సేఫ్టీకి గ్యారంటీ ఇవ్వకుండానే నవంబర్ లో వ్యాక్సిన్ విడుదల చేస్తామని చెబుతుండటం గమనార్హం. చైనా జాతీయ ఫార్మా గ్రూప్‌ , సినోవాక్‌ బయోటెక్‌ తో కలిసి మూడు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేశాయి. కాగా, వీటి ప్రయోగాలు చైనాతోపాటు యూఏఈలోనూ కొనసాగుతున్నాయి. మూడో దశ ప్రయోగాలు ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని సినోఫార్మ్‌ జులై నెలలోనే ప్రకటించింది. సినోఫార్మ్‌ అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో 31వేల మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ డోసు ఇవ్వాల్సిన అవసరం లేదని చైనా సర్కారు భావిస్తున్నది. ముందుగా సైనికులు, ఆ తర్వాత కొవిడ్‌పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటున్నామని, సాధారణ ప్రజలు అందరికీ డోసులు అవసరం లేదని చైనా సీడీసీ డైరెక్టర్ చెప్పారు.