Begin typing your search above and press return to search.

స్వాముల మూడవ కన్ను : ఒకనాడు ఆశీస్సులు... ఈనాడు ఆగ్రహాలు

By:  Tupaki Desk   |   20 May 2022 10:30 AM GMT
స్వాముల మూడవ కన్ను  :  ఒకనాడు ఆశీస్సులు... ఈనాడు ఆగ్రహాలు
X
స్వాములు అంటే ఇహ లోక ప్రపంచానికి ఏ మాత్రం సంబంధం లేకుడా తమ జ్ఞానంలో ధ్యానంలో మునిగి తేలేవారు అని చెబుతారు. అయితే ఆధునిక కాలంలో జనం మధ్యన ఉండే స్వాములు తాము కేవలం జ్ఞాన బోధను మాత్రమే చేస్తామని, అంత మాత్రం చేత ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని అన్నీ వదిలేయలేమని కూడా వైఖరి ద్వారా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే స్వాములకు అందరూ భక్తులే. ఆ మాటకు వస్తే పలుకుబడి కలిగిన భక్తులు ఎక్కువగా కనిపిస్తారు. ఇక రాజకీయ భక్తులు ప్రత్యేక క్యాటగిరీగా ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచూ ఆశ్రమాలకు వెళ్ళడం, స్వాములను కలవడం వంటివి చేస్తూ ఉంటారు.

అలా కేసీయార్ విశాఖ శారదాపీఠాదిపతిని హైదరాబాద్ కి పిలిపించి రాజశ్యామల హోమం తో పాటు చాలా యాగాలు చేయించారు. ఆయన విశాఖ శారదాపీఠానికి కూడా అప్పట్లో వచ్చి వెళ్ళారు కూడా. జగన్ సైతం విపక్షనేతగా విశాఖ శారదాపీఠాన్ని ఇప్పటికి పలు మార్లు సందర్శించి అక్కడ పూజలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా అనేక మార్లు వచ్చారు. స్వామీ ఆశీస్సులు కూడా తీసుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ మధ్య తిరుపతిలో జరిగిన ఒక ఆధ్యాంతిక కార్యక్రమంలో పాలుపంచుకున్న శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర టీటీడీ మీద గట్టిగా నిప్పులు చెరిగారు. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడంలేదు అని కూడా అన్నారు. మొత్తానికి అది నేరుగా జగన్ సర్కార్ మీద చేసిన ఘాటైన ఆరోపణంగానే అంతా చూశారు.

సీన్ కట్ చేస్తే చిన జీయర్ స్వామి కూడా తాజాగా ఏపీలోని రోడ్ల మీద తనదైన వ్యాఖ్యం చేశారు. ఆయన రాజమండ్రిలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకుంటూ తాను జంగారెడ్డి గూడెం మీదుగా రాజమండ్రి రావడానికి మూడు గంటలు పట్టిందని, రోడ్ల వద్ద గుంతలు గోతులు చాలా ఎక్కువగా ఉన్నాయని, తాను వ్యయ ప్రయాసలు పడ్డానని చెప్పారు.

ఒక విధంగా ఇది జగన్ సర్కార్ మీద వేసిన డైరెక్ట్ సెటైర్. ఆయన సభలో ఉన్న భక్తులు కూడా దీని మీద చర్చించుకున్నారు కూడా. చిన జీయర్ స్వామి వారితో కూడా జగన్ సాన్నిహిత్యంగా ఉంటారు. అలాగే ఈ మధ్యన ముచ్చింతల్ లో జరిగిన రామానుజుల వారి విగ్రహావిష్కరణకు జగన్ వెళ్లడం జరిగింది. దాని కంటే ముందు విపక్ష నేతగా ఉన్నపుడు జగన్ ఆయన్ని పలు మార్లు కలసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

మరి సడెన్ గా చిన జీయర్ స్వామి ఎందుకు వైసీపీ సర్కార్ మీద బాణాలు వేశారు అన్న దాని మీద చర్చ అయితే సాగుతోంది. చిన జీయర్ స్వామి వారికి కేసీయార్ కి కూడా కొంత గ్యాప్ వచ్చింది అన్న ప్రచారం కూడా ఉంది. ముచ్చింతల్ లో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శిలా ఫలకం మీద కేసీయార్ పేరు లేకపోవడంతో ఆయన హర్ట్ అయ్యారని చెబుతారు.

బీజేపీ ప్రధాని మెప్పు కోసమే ఆశ్రమవాసులు ఇలా చేశారని కూడా అంటారు. మొత్తానికి చూస్తే చినజీయర్ స్వామితో నాటి నుంచి కేసీయార్ కొంత దూరం పాటిస్తూ వస్తున్నారు. ఇపుడు చూస్తే జగన్ సర్కార్ మీద స్వామి చేసిన తాజా వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద స్వాముల ఆగ్రహానికి కారణం ఏంటి అన్న చర్చ సాగుతోంది.

నిజానికి స్వామీజీలు తమ రాజకీయ భక్తులకు ఇంతదాకా ఆశీర్వాదాలు ఇచ్చారు. వారు నిండుగా హాయిగా ఉండాలని కోరుకున్నారు. మరి ఇపుడు ఆశీస్సుల స్థానంల్లో ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి అంటే ఆలోచించాల్సిందే మరి అంటున్నారు.