Begin typing your search above and press return to search.

డోక్లాం మాదే..చైనా మ‌ళ్లీ బ‌రితెగింపు

By:  Tupaki Desk   |   3 Dec 2017 8:36 AM GMT
డోక్లాం మాదే..చైనా మ‌ళ్లీ బ‌రితెగింపు
X
పొరుగున ఉన్న చైనా మ‌రోమారు తెగింపున‌కు సిద్ధప‌డింది. గ‌త సంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా సైనిక బ‌ల‌గాల‌ను కొన‌సాగించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అందులోనూ వివాదాస్ప‌ద డోక్లాంను త‌మ‌దిగా క్లెయిం చేసుకుంటూ...అక్క‌డ త‌మ బ‌ల‌గాలు ఉంటాయ‌ని తేల్చిచెప్పింది. త‌ద్వారా మ‌రోమారు క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది. భారత్‌ తో వివాదాంశంగా ఉన్న డోక్లాం ప్రాంతం తనదేనని కూడా చైనా పునరుద్ఘాటించింది. అంతేకాకుండా డోక్లాం ప్రాంతానికి సమీపంలో ఈ శీతాకాలంలో గణనీయ సంఖ్యలో భద్రతా బలగాల మోహరింపును కొనసాగించనున్నట్టు చైనా సైన్యం తెలిపింది. భారత్- చైనాల మధ్య డోక్లాంపై 73 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్త భరితమైన ప్రతిష్టంభన ఆగస్టు 28న తొలగిపోయిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ తాజా ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

భారత భూభాగంలో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఇరుకు ప్రాంతానికి సమీపంలో ఒక వ్యూహాత్మక రోడ్డును నిర్మించడానికి చైనా పూనుకుంది. దీంతో తలెత్తిన ప్రతిష్టంభన చివరకు చైనా ఆ నిర్మాణ పనులను నిలిపివేయడంతో తొలగిపోయింది. భూటాన్ కూడా సదరు భూభాగం తనదేనని వాదిస్తోంది. చైనా సైన్యం రోడ్డు నిర్మాణానికి పూనుకోవడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతికూల వాతావరణం ఉండే శీతాకాలంలో ఈ డోక్లాం పరిసర ప్రాంతం నుంచి గతంలో భారత్ - చైనాలు తమ బలగాలను ఉపసంహరించుకుంటూ ఉండేవి. ఇందుకు విరుద్ధంగా ఈ శీతాకాలంలో ఇటీవల ప్రతిష్టంభన నెలకొన్న డోక్లాం ప్రాంతానికి సమీపంలో సైనిక బలగాల మోహరింపును కొనసాగించాలని ఈసారి చైనా నిర్ణయించింది. ఈ విషయమై అధికారికంగా చైనా తన వైఖ‌రిని వెల్ల‌డించింది. ‘డోక్లాం చైనా భూభాగమే’ అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ వు కియాన్ బదులిచ్చారు. డోక్లాం ప్రాంతం తమదే అయినందున, అక్కడ బలగాల మోహరింపుపై తామే స్వంతంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

డోక్లాంకు సమీపంలో గల యాటుంగ్ ప్రాంతానికి దగ్గరలో ఈ శీతాకాలంలో చైనా తన బలగాల మోహరింపును కొనసాగించాలని నిర్ణయించడంతో భారత్ కూడా ఆ ప్రాంతంలో తన బలగాల మోహరింపును కొనసాగించే పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల 17న ఇక్కడ భారత్ - చైనాల మధ్య జరిగిన భారత్ - చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పడిన వర్కింగ్ మెకానిజం 10వ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందా? లేదా? అనే విషయం వెల్లడి కాలేదు.