Begin typing your search above and press return to search.

ఇండియాకు ఆక్సీజ‌న్ రాకుండా అడ్డుకుంటున్న చైనా .. !

By:  Tupaki Desk   |   27 April 2021 6:30 AM GMT
ఇండియాకు ఆక్సీజ‌న్ రాకుండా అడ్డుకుంటున్న చైనా .. !
X
ఇండియా కరోనా వైరస్ దెబ్బకి అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే ప్రతిరోజూ వేలాది మంది మరణిస్తున్నారు. మొదటి వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్ రెండో వేవ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే కరోనా కట్టడి కోసం అని అనేక చోట్ల ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి సహాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనా , భారత్ కి సహాయం చేయడానికి ఓ వైపు సిద్ధం అంటూనే మరోవైపు తమ కపటబుద్దిని చూపించింది.

చైనా ప్రభుత్వ ఆధర్యంలో నడిచే సిచువాన్ ఎయిర్ లైన్స్ సంస్థ.. భారత్ కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే.. సిచువాన్ ఎయిర్ లైన్స్ తాజా నిర్ణయంతో చైనా నుంచి భారత్ కు ఆక్సిజన్, ఔషధాలు రవాణా చేసే ప్రైవేట్ వర్తకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. అయితే.. అంతకుమందు కరోనాపై పోరాటంలో భారత్కు తాము సహాయ, సహకారాలను అందిస్తామని చైనా ప్రకటించడం గమనార్హం. భారత్ లో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో.. మన దేశంలో కేసులు పెరగకూడదనే ఉద్దేశంతో.. 15 రోజుల పాటు కార్గో విమానాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సిచువాన్ ఎయిర్ లైన్స్ కు భారత్ మార్గం అత్యంత వ్యూహాత్మకమైనది. ఈ రద్దు నిర్ణయం ద్వారా మన సంస్థకు తీరని నష్టం ఎదురువుతుంది. అందుకు మేం క్షమాపణలు కోరుతున్నాం అని ఆ యాజమాన్యం ప్రకటించింది.

అంతే కాకుండా.. చైనాలోని ఆక్సిజన్ తయారీదారులు.. ధరలను 35 నుంచి 40 శాతానికి పెంచారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సరుకు రవాణా ఛార్జీలనూ చైనా ప్రభుత్వం 20 శాతానికి పెంచిందని సినో గ్లోబల్ లాజిస్టిక్స్కు చెందిన సిద్ధార్ధ్ సిన్హా తెలిపారు. సిచువాన్ ఎయిర్ లైన్స్ కార్గో విమానాలను రద్దు చేయడంతో ఇతర దేశాల మీదుగా అత్యవసరమైన ఆక్సిజన్, ముడి సరుకు రవాణా చేయాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చైనా విమానాలను రద్దు చేసి, చార్జీలు పెంచి కుట్రలు చేస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.