Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల ఎరపై కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్.. 'కీ' పాయింట్స్ ఇవే - 1

By:  Tupaki Desk   |   4 Nov 2022 5:31 AM GMT
ఎమ్మెల్యేల ఎరపై కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్.. కీ పాయింట్స్ ఇవే - 1
X
దేశ రాజకీయాల్ని షేక్ చేసేదని గులాబీ అధినేతతో సహా పార్టీ వారంతా చెబుతున్న సంచలన ప్రెస్ మీట్ గురువారం రాత్రి ఎనిమిది గంటల వేళలో నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దాదాపు గంటకు పైగా సాగిన ఈ ప్రెస్ మీట్ లో.. తమ పార్టీ ఎమ్మెల్యేలకు నోట్లతో ఎర వేసి.. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను ప్రదర్శించారు.

ఇందులో తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ అధినాయకత్వానికి చెందిన బ్రోకర్లు ఎలా ఎర వేసిందన్న తీవ్రమైన ఆరోపణలతో పాటు.. దానికి సంబంధించిన వీడియోలోని కొన్ని భాగాల్ని ప్రదర్శించారు. మొత్తం మూడు గంటల వీడియో ఫుటేజ్ ఉంటే.. దాన్ని స్లిమ్ చేసి గంటకు కుదించినట్లు చెప్పారు. అనవసరంగా టైం వేస్టు కాకుండా తామీ పని చేశామన్న కేసీఆర్.. ఒరిజినల్ వీడియోను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదలు నుంచి మీడియా కార్యాలయాలకు.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా పంపినట్లుగా చెప్పారు. తెలుగు.. మధ్యమధ్యలో ఇంగ్లిషు.. చివర్లో ధారాళంగా హిందీలో సాగిన ప్రెస్ మీట్ లో ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే..

- ఈరోజు భారమైన మనసుతో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నా. కేంద్రంలోని బీజేపీ పాలకులు దేశంలో ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేస్తున్నారు. మేం తెలంగాణ ఉద్యమ సమయంలో హుందాగా వ్యవహరించాం. కానీ, దేశంలో ఇపుడేం జరుగుతున్నదో చూశారా? 8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని అన్నిరంగాల్లో వెనుకపడేసింది. బిజేపి చిల్లర రాజకీయాలతో మునుగోడు ఎన్నిక తెచ్చింది. బిజేపి దేశంలో అన్నిరంగాలనూ సర్వనాశనం చేస్తున్నది.

- దేశంలో ప్రజాస్వామ్యానికి లెజిస్లేచర్, కార్య నిర్వాహక శాఖ, న్యాయ శాఖ, ప్రెస్ నాలుగు స్థంభాలు. కానీ, ఇవాళ బీజేపీకి వీటిని లెక్క చేయడం లేదు. ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కొన్ని రాజ్యాంగేతర ముఠాలు వికృతంగా చేస్తున్నాయి. ఆ ముఠాల వికృతాలన్నీ సీబీఐ, ఈడీ, సీవీసీ, న్యూస్ ఏజెన్సీలు, పీటీఐ, ఎఎన్ఐకి పంపుతున్నాం. అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని పార్టీల అధ్యక్షులకు పంపుతున్నాం. ఈ దేశ ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న వారంతా ఈ ఘాతుకాలు తెలుసుకోవాలి.

- ఈ వీడియోల్లో వ్యవహారం చేస్తున్న వాళ్లంతా ఏం అంటున్నరో మీరే వినండి. ‘‘అమౌంట్ ఎంతో చెప్పండి.. ఈ వ్యవహారం అంతా సంతోష్, అమిత్ షా, నడ్డా ఆపరేట్ చేస్తారు. ఇప్పటికే 8 రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొట్టాం.. ఇంకో 4 రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చే పనిలో ఉన్నాం. మొత్తం 24మంది మా టీమ్ లో ఉంటారు.. మేం చార్టెడ్ ప్లైట్లలో తిరుగుతాం. ఎవరైనా ప్రధాని మోడీతో కలిసి పనిచేయకుంటే.. వారిపైకి ఈడీ వస్తుంది..

- ఈ వీడియోలలో అమిత్ షా పేరు చాలాసార్లు వాడారు.. రెండుసార్లు ప్రదాని మోడీ పేరు వాడారు. సాక్ష్యాలన్నింటినీ యథాతథంగా పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు, న్యూస్ ఏజెన్సీలకు, న్యాయస్థానాలకు, అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పార్టీల అధ్యక్షులకు పంపించాం. బిజేపి సాగించే అరాచకాలకు చరమగీతం పాడాలి. ఎవరూ ఊహించని అంశాలు తెలిశాక నేను షాక్ అయ్యాను. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వేడుకుంటుంన్నాను. ఇప్పటికే ఈ ఆధారాలన్నింటినీ హైకోర్టుకి ఇచ్చాం. దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు పంపుతాం.

- ఇందిరా గాంధీకి దేశంలో ఎదురులేదనుకున్న సమయంలో ఎమర్జెన్సీ పొరపాటు ఆమెను ముంచింది. ఇపుడు దేశంలో బీజేపీ కూడా ఒళ్ళు మరిచి అరాచకంగా, జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నది. ఈ సందర్భంగా బెంగాల్లో ప్రధాని మోడీ ప్రసంగించిన వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రే బెంగాల్ లో టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఒక ప్రధానమంత్రే ఇలా మాట్లాడవచ్చా? తల్లి దయ్యమైనంక.. పిల్లలు ఏమవుతరు? ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తదా?

- ప్రధాని మోడీ అలా మాట్లాడితే.. కింద బీజేపీ వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతరు. తెలంగాణలో, తమిళనాడులో ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తామని అంటుంటారు. వాళ్లు ఇష్టం వచ్చినట్లు అంటే మేం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఏ బలాన్ని చేసుకోని వీరంతా ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎంత అహంకారం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతారు.

- ఎనిమిది ప్రభుత్వాలు కూల్చాం. మరో 4 ప్రభుత్వాలను కూల్చుతామంటున్నారు. లిస్టులో రాజస్థాన్, తెలంగాణ, ఏపీ, ఢిల్లీ ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర చేశారు. ఆ ముఠాను పట్టుకున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ తెలిశాయి గత నెలలోనే రామచంద్ర భారతి ఇక్కడికి వచ్చారు. వీరి ముఠాలో మొత్తం 24 మంది ఉన్నారని చెప్తున్నారు. ఒక్కొక్కరికి రెండు, మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి

- మీకు ఈడీ నుంచి ఐటీ వరకూ ఏం కాకుండా మేం చూసుకుంటామంటున్నారు. ఈ రాజ్యాంగేతర శక్తులు వై కేటగిరీ భద్రత కల్పిస్తామని కూడా చెప్తున్నారు. దేశం ఎక్కడికి పోతోంది? ఒక్కసారి దేశం దెబ్బ తింటే వంద ఏళ్ళు వెనక్కి వెళతాం. తుషార్ అనే వ్యక్తి రాహుల్ గాంధీ పై వాయినాడ్ లో పోటీ చేశారు. ఆయన కూడా దీని వెనుక ఉన్నాడు. ఆయన అభ్యర్థిత్వాన్ని అమిత్ షా ఖరారు చేశారు. ఎటుపోతుందీ దేశం?

- గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర పోరాటం చేశారు. జలియన్ వాలా బాగ్ లాంటి సంఘటనలు కూడా జరిగాయి. వీరందరి పోరాటం త్యాగాలతోనే మనకు స్వతంత్రం వచ్చింది. ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా మారింది. కానీ, బీజేపీ ఈ దేశాన్ని అన్నిరంగాల్లో ఆగం చేసింది. సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు లేదు. అయినా ఎవరూ ప్రశ్నించ వద్దట. ఇదేం న్యాయం?

- ప్రశ్నించిన పార్టీల ఎమ్మెల్యేలను కొంటారట, వారి ప్రభుత్వాలను కూలదోస్తారట. అందుకే మేం ఈ ముఠాను దొరకబట్టాం. సాక్ష్యాలన్నింటినీ కోర్టులో ప్రవేశపెడతాం. మాకు ఏం జరుగుతుంది? ఏమైనా భయం లేదు. ఈ దేశం బాగు కోసం మేం చావనైనా చస్తాం.. కానీ భయపడం.

- ఈవీఎం వివిప్యాడ్ లపై కూడా ఈ ముఠా మాట్లాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గం దేశంలో నడువొద్దు. దీన్ని ఒక కేస్ లాగా చూడొద్దు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాలి. దేశంలో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికే బీజేపీ రూ.12,000 కోట్లు ఖర్చు చేసిందట. ఈ మధ్య దినపత్రికలో ఒకరు రాశారు. ఇకపై ఇది జరగడానికి వీల్లేదు.. దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలి. లేదంటే దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.