Begin typing your search above and press return to search.

ఛోటా రాజన్ ను బాగానే వాడుకున్నారు

By:  Tupaki Desk   |   27 Oct 2015 11:08 AM GMT
ఛోటా రాజన్ ను బాగానే వాడుకున్నారు
X
మాఫియా లీడర్ ఛోటా రాజన్ అరెస్టుకు తానే కారణమంటూ ఆయన శత్రువు ఛోటా షకీల్ చెబుతున్నప్పటికీ ఆ క్రెడిట్‌ ఆయనది కాదని తెలుస్తోంది. రెండు రకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. పోలీసులకు చిక్కేలా ఛోటా రాజనే ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు పలు సందర్భాల్లో భారత ప్రభుత్వం, ఇక్కడి నిఘా వ్యవస్థలకు దావూద్ కు సంబంధించిన సమాచారం ఇచ్చినందుకు ప్రతిఫలంగా రాజన్ ను శత్రువుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వమే అరెస్టు చేసి ఇండియలోని జైళ్లలో ఉండేలా ఈ అరెస్టు జరిగిందని ఓ కొత్త వాదన వినిపిస్తోంది.

రెండు దశాబ్దాలకు పైగా అధికారులకు, తన ప్రత్యర్థి దావూడ్ ఇబ్రహీంకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఛోటా రాజన్‌ కు వయస్సు పైనపడుతోంది. ఆరోగ్య సమస్యలు అధికమై ఇంతకుముందులా చురుగ్గా లేడని... కొన్నాళ్లుగా శత్రువుల వల్ల ప్రాణభయంతో వారానికో దేశం తిరుగుతూ రహస్యంగా గడుపుతున్నాడని తెలిసింది. ఆ నేపథ్యంలోనే ఇండియాలో జైళ్లలో ఉండడమే సేఫన్న ఉద్దేశంతో తనకు తానుగానే అరెస్టయ్యాడని సమాచారం.

ఛోటా రాజన్ ఆరెస్టుతో ముంబైకి తిరిగి వచ్చిన అతని కుటుంబం కూడా ఊరట పొందింది. 2011లో జరిగిన జర్నలిస్టు జేడె హత్య కేసులో అతను నిందితుడు. రాజన్‌ ను ఛోటా షకీల్ ఈ ఏడాది జులైలో ఆస్ట్రేలియాలో చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు ఛోటారాజన్ అరెస్టుతో చాలా కేసుల్లో మిస్టరీ తొలగిపోతుందని ముంబై పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా మాఫియా చేతిలో హాతమైన 'మిడ్ డే' పత్రిక జర్నలిస్టు జే డే హత్యతోపాటు అనేక నేర - ఉగ్రవాద కేసుల్లో అతని నుంచి కీలక ఆధారాలు రాబట్టాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. అయితే, కొన్నేళ్లుగా మాఫియా ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఆయన ఏకాంత జీవితం గడుపుతుండడంతో ఆయన నుంచి సమాచారం ఏమీ దొరక్కపోవచ్చని చెబుతున్నారు.

1998లోనే థాయ్ ల్యాండ్ లో ఛోటా రాజన్ ను దొరికాడు. అయితే... మరుసటి రోజే విడిచిపెట్టారు. దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడిగా ఆయన చాలాకాలం పనిచేయడంతో దావూద్ గుట్టుమట్లు తెలుసుకోవడానికి భారత నిఘా సంస్థలు ఆయన్ను వాడుకున్నాయి. అందుకే అతణ్ని భారత్ రప్పించడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు కూడా. 1993 ముంబై పేలుళ్లతో దావూద్ కు దూరం జరిగిన ఛోటా రాజన్ తనను తాను దేశభక్త హిందూ డాన్ గా ప్రకటించుకున్నాడు. ముఖ్యంగా రీసెర్చ్ అనాసిస్ వింగ్ (రా), ఐబీలు రాజన్ ను దావూద్ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నాయని చెబుతుంటారు. నేపాల్ లో మాఫియా డాన్ అయిన ఎమ్మెల్యే దిల్షాద్ మీర్జా బైగ్, ఐఎస్ఐ మాస్టర్ మైండ్ ఖలీద్ మసూద్ - పర్వెజ్ టాండా వంటి దావూద్ ముఖ్య అనుచరులను నిఘావర్గాల మద్దతుతోనే ఛోటా రాజన్ హతమార్చాడు.