Begin typing your search above and press return to search.

సారుకు మించి సారుకే శాపం పెట్టేసిన పార్టీ అధినేత

By:  Tupaki Desk   |   3 Jun 2020 4:00 AM GMT
సారుకు మించి సారుకే శాపం పెట్టేసిన పార్టీ అధినేత
X
డిజిటల్ యుగంలో శాపాలు పెట్టటం లాంటివి కనిపించవు. ఇలాంటి చిత్ర విచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. రాజకీయాలన్నంతనే విమర్శలతో విరుచుకుపడటం.. ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేయటం మామూలే. ఆ మాటకు వస్తే.. తాను నమ్ముకున్న వాదానికి అడ్డుగా నిలిచిన వారందరిపై నిరసనలు.. ఆందోళనలతో విరుచుకుపడిన కేసీఆర్.. తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్న వైనాన్ని మర్చిపోకూడదు. తాను నడిచొచ్చిన మార్గాన్ని మూసేయటమే కాదు.. ఆ తీరులో ఎవరైనా నాలుగు అడుగులు ముందుకేస్తే చాలు.. నియంత్రించే గుణం సారులో ఎక్కువన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

రాజకీయంగా తనను తప్పు పట్టిన వారిపై మండిపడే కేసీఆర్.. ఆ మధ్యన మరింత ఆగ్రహానికి గురై.. మాయదారి రోగం వచ్చేయాలని శాపాలు పెట్టిన తీరుతో రాజకీయ నేతలు విస్మయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలన్నాక మాట అనటం.. అనిపించుకోవటం కామన్ అయినప్పుడు.. అంత మాత్రం దానికే మాయదారి రోగం వచ్చేయాలంటూ శాపం పెట్టే కేసీఆర్ తీరును తప్పు పట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేసీఆర్ తరహాకు మించిన దూకుడును ప్రదర్శిస్తున్నారు తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్.

అప్పుడప్పుడు నోటికి పని చెప్పే ఈ పెద్ద మనిషి.. తాజాగా సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ మాట్లాడిన ఆయన.. జై తెలంగాణ అన్న వాల్లు జైళ్లలో.. నై తెలంగాణ అన్నోళ్లు కేసీఆర్ చుట్టూ ఉన్నారన్నారు. ఈ విమర్శతో సరిపెట్టని ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేయటమే కాదు.. దిమ్మ తిరిగిపోయే శాపాన్ని పెట్టారు.

తెలంగాణ ప్రజల్ని హింసిస్తున్న కేసీఆర్ కు కరోనాకు మించిన పెద్ద వైరస్ సోకాలన్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ మాదిరి శాపాలు పెట్టేవారు లేరన్న లోటును తన తాజా వ్యాఖ్యలతో చెరుకు సుధాకర్ తీర్చేశారని చెప్పక తప్పదు. అంత పెద్ద సారును.. ఇలా ఓ చిన్న రాజకీయ పార్టీ అధినేత చేసిన తీవ్ర వ్యాఖ్యపై గులాబీదండు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.