Begin typing your search above and press return to search.

చంద్రుడి కక్షలోకి వెళ్లిన చంద్రయాన్ 2

By:  Tupaki Desk   |   20 Aug 2019 6:02 AM GMT
చంద్రుడి కక్షలోకి వెళ్లిన చంద్రయాన్ 2
X
యావత్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సరిగ్గా 29 రోజుల క్రితం భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2.. అనుకున్న రీతిలోనూ చక్కటి పని తీరును ప్రదర్శిస్తూ.. ముందుగా నిర్దేశించిన దానికి తగ్గట్లుగా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. తాజాగా చంద్రయాన్ 2లో మరో కీలకఘట్టం విజయవంతంగా పూర్తైంది. ప్రయోగం అనంతరం లూనార్ ట్రాన్స్ ఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రుడి కక్ష్య లోకి ఈ రోజు ఉదయం భారత కాలమానం ప్రకారం 9.02 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ 9.20 గంటల వేళలో విజయవంతంగా అడుగు పెట్టటంతో పూర్తి అయ్యింది. చంద్రుడి కక్ష్యలో ప్రవేశ పెట్టటానికి 1738 సెకన్ల సమయం తీసుకుంది.

ఇస్రో అనుకున్న ప్రకారమే చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 2 ఉపగ్రహం అడుగు పెట్టింది. ఇప్పటివరకూ ఉప గ్రహంలోని అన్ని వ్యవస్థలు సరిగా పని చేస్తున్నట్లుగా ఇస్రో ప్రకటించింది. ఈ మొత్తం ప్రయోగంలో అత్యంత కష్టమైన.. క్లిష్టమైన ప్రక్రియ చంద్రుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టటంగా చెప్పారు. ఆ కార్యక్రమాన్ని నేడు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. తాజాగా చంద్రయాన్ 2 వేగాన్ని తగ్గించి దాని దశ.. దిశను మార్చారు. దీంతో ఉపగ్రహం చంద్రుడి 114కి.మీ x 18072 కి.మీ కక్ష్యలోకి చొచ్చుకెళ్లింది. వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్ ను మండించటం ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటి నుంచి మరో నాలుగు విన్యాసాలు చేయటం ద్వారా చంద్రుడికి చేరువుగా ఉండే చివరి కక్ష్యలోకి చేరుకుంది.

ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం సెప్టెంబరు 7 తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2.30 గంటల మధ్యలో చంద్రయాన్ 2 చంద్రుడి మీద ల్యాండింగ్ కానుంది. ఆ వెంటనే ఆర్బిటర్.. ల్యాండర్ లో ఏర్పాటు చేసిన కెమేరాలు ల్యాండింగ్ ప్రాంతాన్ని.. రియల్ టైమ్ ఫోటోల్ని తీసి కిందకు పంపనున్నాయి.

ల్యాండింగ్ అయ్యాక ఆరు చక్రాల రోవర్ దాదాపు నాలుగు గంటల తర్వాత బయటకు వస్తుంది. ఇది సెకనుకు సెంటీమీటరు వేగంతో పయనిస్తుంది. 14 రోజుల్లో 500 మీటర్ల దూరం చంద్రునిపై ప్రయాణం చేసి.. అక్కడ తీసిన డేటా మొత్తాన్ని ల్యాండర్ ద్వారా 15 నిమిషాల్లో భూమి మీదకు పంపనుంది. అపారమైన ఖనిజ సంబంధించిన అంశాల మీద అధ్యయనం కోసం చంద్రయాన్ 2 జరిపే పరిశోధన ఏమేరకు ఫలితాల్ని ఇస్తుందో చూడాలి.