Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసుపై చంద్రబాబు తాజా స్పందన

By:  Tupaki Desk   |   28 Feb 2022 10:35 AM GMT
వివేకా హత్య కేసుపై చంద్రబాబు తాజా స్పందన
X
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ఊపేస్తోంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున జరిగిన ఈ హత్య అప్పటి ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపింది. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పైగా ఆయన మీడియాలో ‘‘నారాసుర రక్త చరిత్ర’’ పేరిట ప్రత్యేక కథనం ఇచ్చారు. దీనిపై టీడీపీ శ్రేణులు, అభిమానులు అప్పట్లో మండిపడ్డారు.

వాస్తవానికి సీఎంగా ఉన్న చంద్రబాబు నాడు వివేకా హత్య కేసుకు సంబంధించి సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అనుమానితులుగా బయటకు వస్తున్నవారి పేర్లే గతంలోనూ ప్రస్తావనకు వచ్చాయి. అప్పట్లోనే వారిని జైలులో వేసినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ, అలా చేయకపోవడంతో ఇప్పటికీ కేసు కొలిక్కి రాలేదన్న అభిప్రాయం ఉంది.

అయితే, వివేకా హత్య కేసులో కొన్ని రోజుల నుంచి వరుసగా వాంగ్మూలాలు బయటకు వస్తున్నాయి. సోమవారం పత్రికల్లో వైఎస్ బావమరిది, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, వివేకా కుమార్తె డాక్టర్ సునీతా, తదితరుల వాంగూల్మాలు ప్రచురితమయ్యాయి.

కాగా, ఈ కేసుపై మాజీ సీఎం చంద్రబాబు సోమవారం స్పందించారు. ఏ వాంగ్మూలం చూసినా సీఎం జగనే దోషిగా తేలుతున్నారని.. ఈ విషయంలో సీఎం పూర్తిగా కూరుకుపోయారని అన్నారు. వివేకా హత్యను తనపై నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ధ్వజమెత్తారు. పార్టీ ముఖ్యనేతలతో ఆన్‌లైన్‌లో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. బాబాయ్ హత్య ఘటనతో సీఎం నైతికంగానూ పతనమయ్యారన్నారు. ‘‘హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది? నాపై 12వ కేసు అవుతుంది’’ అని జగన్ వ్యాఖ్యానించడం చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు.

వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్యలో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ‘‘నాడు గ్యాగ్ ఆర్డర్ తేవడం నుంచి ఇప్పుడు సీబీఐ విచారణను తప్పుబట్టడం వరకు వివేకా హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు మళ్లింపు రాజకీయాలు అమలు చేస్తున్న సీఎం.. ప్రజలు అవివేకులు కాదని తెలుసుకోవాలి.

హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారులను బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుడి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. వైఎస్ కోటలోనే వైఎస్ సోదరుడిని హత్యచేయడం అంటే.. అంతఃపురం పెద్దల ప్రోత్సాహం లేకుండా ఎలా సాధ్యం’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.