Begin typing your search above and press return to search.

వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు ట్రంప్ కార్డ్

By:  Tupaki Desk   |   1 July 2019 10:07 AM GMT
వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు ట్రంప్ కార్డ్
X
జగన్ దెబ్బకు కిందామీదా పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఆదరణ, క్యాడర్లో నమ్మకం కోల్పోయిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ క్యాడర్, ప్రజల్లోకి వెళ్లి మునుపటిలా మారాలని నిర్ణయించుకున్నారని టీడీపీ వర్గాల నుంచి తెలుస్తోంది. దీన్ని క్యాడర్‌ తోనే మొదలుపెట్టాలనుకుంటున్నారట.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ కార్యకర్తలపై గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయని... హత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే గళం విప్పుతున్న ఆ పార్టీ ఇక దీన్ని మరింత వ్యూహాత్మకంగా వాడుకోవాలని నిర్ణయించుకుందట. వైసీపీ దాడుల్లో ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలనే కాకుండా తీవ్రంగా గాయపడిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చేందుకు చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారని.. ఓదార్పు యాత్ర చేపట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు.. ఎవరెవరిపై దాడులు జరిగాయో… సమాచారం సేకరిస్తోంది.

ఇప్పటి వరకూ 150కిపైగా దాడులు జరిగాయని.. ఆస్తుల విధ్వసం… హత్యలు కూడా చోటు చేసుకున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. వీరందర్నీ పరామర్శించడానికి చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారట. ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా ఎలా నిర్వహించాలి, మళ్లీ పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం ఎలా నింపాలన్నది ఆలోచిస్తున్నారట.

ఓదార్పు యాత్ర తరువాత వైసీపీ పాలనలో ప్రజలకు సంక్షేమం అందుతుండడం నిజమా కాదా అన్నది తేల్చేందుకు... అందడం లేదని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు బస్సు యాత్ర నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఒకటి సీనియర్ల నుంచి వచ్చినట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే అచ్చంగా జగన్ వ్యూహాన్నే చంద్రబాబు అనుసరిస్తున్నట్లుగా లేదూ.