Begin typing your search above and press return to search.

ఏపీలో అదిరిపోయే పథకం షురూ నేడే

By:  Tupaki Desk   |   17 March 2016 10:29 AM IST
ఏపీలో అదిరిపోయే పథకం షురూ నేడే
X
సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ సర్కారుతో పోలిస్తే.. ఏపీ సర్కారు నెమ్మదిగా ఉందని.. కేసీఆర్ తో చంద్రబాబు పోటీపడలేకపోతున్నారన్న విమర్శ చాలా బలంగా వినిపిస్తోంది. సంక్షేమ పథకాల విషయంలోనే కాదు.. వినూత్న అంశాల్ని తెరపైకి తీసుకురావటం.. పాలనలో కొత్త హంగులు జొప్పించటంలో చంద్రబాబు తడబాటుకు గురి అవుతుంటే.. కేసీఆర్ చెలరేగిపోతున్నారన్న వాదన జోరుగా సాగుతున్న వేళ.. చంద్రబాబు సర్కారు ఒక వినూత్న పథకాన్ని తెర మీదకు తెచ్చింది.

నిజానికి ఈ పథకం గత కొంతకాలంగా చెబుతున్నా.. అమల్లోకి మాత్రం ఈ రోజు నుంచే రానుంది. సాంకేతిక విప్లవం ద్వారా సాధించిన ఫలాల్ని సామాన్యులకు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు చేపట్టిన కీలక పథకంలో ఒకటి..రూ.150లకే ఇంటర్నెట్.. ఫోన్.. టీవీ సౌకర్యం కల్పించటం. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా.. కారు చౌకకే ఇంటర్నెట్ సేవల్ని అందించటమే లక్ష్యంగా బాబు పెట్టుకున్నారు. ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా 22,500కిలోమీటర్లు అఫ్టికల్ ఫైబర్ కేబుల్ వేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ 9వేల కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ వేసిన సర్కారు.. మిగిలిన లక్ష్యాల్ని త్వరలో పూర్తి చేయనుంది.

ఈ రోజు షురూ చేసే పథకాన్ని ఏప్రిల్ నుంచి విశాఖలో అందించనున్నారు. దశల వారీగా రాష్ట్రం మొత్తం ఈ పథకం అమలు కానుంది. ఏపీలోని 1.3 కోట్ల గృహాలు.. వ్యాపారసంస్థలకు దీని ద్వారా ఇంటర్నెట్ సేవల్ని అందిస్తారు. నెలకు కేవలం రూ.150 చెల్లిస్తే.. ప్రతి ఇంటికి 10 – 15 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్.. ఫోన్.. టీవీ సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ పథకానికి నాంది అయిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభ కార్యక్రమాన్ని గురువారం విశాఖలో షురూ చేయనున్నారు. ప్రభుత్వం మాటల్లో చెప్పినట్లే చేతల్లో చూపించగలిగితే.. సరికొత్త సాంకేతిక పథకాన్ని అతి తక్కువ ధరకు అందజేసిన ఘనత చంద్రబాబుకు దక్కటం ఖాయం.