Begin typing your search above and press return to search.

టీడీపీ కాపు నేతలు.. ఏం చేయబోతున్నారు?

By:  Tupaki Desk   |   28 Jun 2019 12:30 PM GMT
టీడీపీ కాపు నేతలు.. ఏం చేయబోతున్నారు?
X
ఇటీవల చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా.. తెలుగుదేశం పార్టీలోని కాపునేతలు కాకినాడలో సమావేశం నిర్వహించి ఆశ్చర్యపరిచారు. ఆ సమావేశం గురించి మీడియాకు సమాచారం ఇచ్చి, ఇవ్వకుండా వారు ఆసక్తిదాయకమైన రాజకీయాన్ని నడిపించారు. ఆ సమావేశంలో తాము తమ ఓటమికి కారణాల గురించి మాట్లాడుకున్నట్టుగా కాపు నేతలు ప్రకటించారు.

అది రహస్య సమావేశం కాదని వారు చెప్పుకొచ్చారు. అయితే.. వారి వాదన అంత నమ్మశక్యంగా కనిపించలేదు. తమ తదుపరి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకోవడానికే కాపు సామాజికవర్గం నేతలు అక్కడ సమావేశం అయ్యారని వార్తలు వచ్చాయి.

ఎవరెవరు ఏమనుకుంటున్నారో అందరూ తెలుసుకోవడానికే ఆ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా విశ్లేషణలు వినిపించాయి. ఆ సమావేశం గురించి చంద్రబాబుకు సమాచారం లేదనే విషయం కూడా బయటకు వచ్చింది. విదేశం నుంచి వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో పాల్గొన్న కాపు నేతలతో సమావేశం కాదలుచుకున్నారు. అందుకే వారందరినీ పిలిపించారు.

అయితే చంద్రబాబు పిలుపులకు సదరు నేతలు సరిగా స్పందించలేదని స్పష్టం అవుతోంది. చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలికినా వారిలో చాలా మంది సమావేశానికి హాజరు కాలేదు. కొంతమంది నేతలు మాత్రం వచ్చి చంద్రబాబును కలిసి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

అయితే అనుకున్న మీటింగు మాత్రం నిర్వహించలేకపోయారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో మరో రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఫిక్స్ అయ్యారట. వచ్చే నెల ఒకటో తేదీన ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నట్టుగా సమాచారం!