Begin typing your search above and press return to search.

ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను మారుస్తా- చంద్రబాబు

By:  Tupaki Desk   |   29 May 2022 3:50 AM GMT
ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను మారుస్తా- చంద్రబాబు
X
జిల్లాల విభజనపై పునః సమీక్షిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మ‌హానాడు వేదిక‌గా.. ఒంగోలులో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో బాబు మాట్లాడారు.

అధికారంలోకి రాగానే ప్రజల డిమాండ్లు.. అభిప్రాయాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయాలన్న డిమాండ్‌ను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల ప్రజలు ప్రకాశం జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు.

గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానన్నారు. ప్రజల దగ్గర డబ్బులు లేకపోగా.. జగన్ మాత్రం తన ఖజానాను నింపుకుంటు న్నాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించేది సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారేనని విమర్శించారు.

ఏ మహానాడు లోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉన్మాదు ల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలివచ్చారని ఆయన తెలిపారు. టీడీపీకి జనాలు ఉన్నారని.. వైసీపీకి బస్సులున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవన్నారు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారని చెప్పారు. మహానాడు వాహనాలకు గాలి తీసేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.

‘‘జగన్‌ కు ఈ రోజు పిచ్చెక్కుతుంది. ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగులు కళ కళ. భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. ఏడాది పాటు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు చేపడుతున్నాం. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు చేపడతాం.’’ అని చంద్రబాబు తెలిపారు.