Begin typing your search above and press return to search.

పుష్కరాలవుతున్నా పట్టిసీమను మర్చిపోలేదు

By:  Tupaki Desk   |   23 July 2015 4:31 PM IST
పుష్కరాలవుతున్నా పట్టిసీమను మర్చిపోలేదు
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం మండలంలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.... గోదావరి జిల్లాలకు నీరిచ్చాకే జలాలు మళ్లిస్తామన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా పది రోజులుగా రాజమండ్రిలో మకాం వేసిన ఆయన హెలికాప్టర్ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతానికి వెళ్లి పనులు పరిశీలించారు. పనిలో పనిగా ఆయన రాజమండ్రి నుంచి మొదలుకుని గోదావరి పొడవునా ఉన్న స్నానఘట్టాలనూ విహంగ వీక్షణం చేశారు. అనంతరం పోలవరం చేరుకుని ఇంధిరాసాగర్‌ ప్రాంతాన్ని ఏరియల్‌ ద్వారా పరిశీలించి రోడ్డుమార్గం మీదుగా పట్టి సీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతానికి బయలుదేరారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో వెంకటాపురం వద్ద దిగి పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.

పట్టిసీమ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి... అనంతరం అక్కడే పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టిసీమ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. గడువులోపు పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పనులకు అవసరమైన 75 పొక్లెయిన్‌లు, టిప్పర్లు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే కొల్లేటి సరస్సుకు కావాల్సిన నీటిని ఇచ్చిన తరువాతే మిగులు నీటిని మళ్లిస్తామని హామీ చ్చారు. గోదావరి జిల్లాల్లో ప్రతి ఎకరాకు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 లోపు పట్టిసీమ, గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.