Begin typing your search above and press return to search.

చంద్రబాబు సంచలన నిర్ణయం.. సైకిల్ దూసుకెళ్ళాల్సిందే...?

By:  Tupaki Desk   |   26 Feb 2022 3:29 AM GMT
చంద్రబాబు సంచలన నిర్ణయం..  సైకిల్ దూసుకెళ్ళాల్సిందే...?
X
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయం మరింతగా పదును తేరుతోంది. ఏపీలో జగన్ సర్కార్ ని దించి తాము గెలవడానికి అనేక మార్గాలను ఆయన అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా వినూత్న ఆలోచనలూ చేస్తున్నారు. గతానికి భిన్నంగా, తన మార్క్ పాలిటిక్స్ కి విరుద్ధంగా కూడా బాబు కొన్ని సంచలన నిర్ణయాలను తొందరలో తీసుకుంటారని తెలుస్తోంది. దాంతో ఏపీలో అధికార వైసీపీకి బ్రేకులు వేయడమే కాకుండా సైకిల్ స్పీడ్ పెంచి విజయాన్ని అందుకోవాలన్నదే బాబు మాస్టర్ ప్లాన్ అంటున్నారు.

చంద్రబాబు అంటే సాధారణంగా పార్టీ నేతలలో ఉండే ఒక అభిప్రాయం ఎక్కువగా ఆలోచిస్తారని, ప్రతీ నిర్ణయాన్ని ఆయన విపరీతమైన జాప్యం చేసి కానీ తీసుకోరని చెబుతారు. అయితే బాబు ఇపుడు మారుతున్నారు. అగ్రెస్సివ్ మోడ్ లో ఆయన వెళ్తున్నారు. ఈసారి ఎన్నికలు ఆయనకు అతి ముఖ్యమైనవి. అందుకే ఆయన ఓల్డ్ ట్రెండ్ ని పూర్తిగా విడిచిపెట్టేస్తున్నారు. దాని కోసం కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు.

ఈసారి ఎన్నికలకు ఏడాది ముందు అంటే 2023లోనే టీడీపీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించాలని బాబు షాకింగ్ డెసిషన్ ఒకటి తీసుకోబోతున్నారు అని పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్న భోగట్టా. అంటే 2024లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి అనుకుంటే ఒక ఏడాది ముందే టీడీపీ అభ్యర్ధులు ఖరారు అయిపోతారన్న మాట. వారు ఏడాది ముందుగానే జనాల్లోకి వెళ్ళి పరిస్థితిని తమకు అనుకూలం చేసుకుంటారన్న మాట.

ఆయా చోట్ల ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వచ్చే వ్యతిరేకతను కూడా ఒడిసిపట్టి తమ వైపు జనాలను తిప్పుకుంటారన్న మాట. అంతే కాదు, పార్టీలో విభేదాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా ఈ కీలక సమయంలో పరిష్కరించుకుని సులువుగా ఎన్నికల గోదాలోకి దిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇది నిజంగా బ్రహ్మాండమైన ప్లాన్. బాబు కనుక అలా చేస్తే ఎమ్మెల్యే టికెట్ల కోసం చివరి నిముషం వరకూ వేచి చూడడం, నామినేషన్లకు గడువు పూర్తి అయిపోతున్న వేళ దాన్ని దాఖలు చేయడం, కేవలం పది రోజుల ప్రచారంతో సరిపెట్టడం వంటివి ఉండవు. అలాగే పార్టీలో వారిని కలుపుకుని ముందుకు పోయేందుకు బోలెడు సమయం కూడా లభిస్తుంది.

బాబు మొత్తానికి మాస్టర్ మైండ్ తోనే ఈ రకమైన ప్రయోగానికి తెర తీశారు అంటున్నారు. ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో దాదాపు వంద నియోజకవర్గాలలో ఏడాది ముందుగా అభ్యర్ధులను టీడీపీ ప్రకటిస్తుంది అని చెబుతున్నారు. మిగిలిన చోట్ల కొన్ని పొత్తులకు పోగా, వివాదాలు ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రం చివరి నిముషంలో అభ్యర్ధులను ప్రకటిస్తారు.

మొత్తానికి చూస్తే వంద నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్ధులు కనుక ప్రకటిస్తే అది టీడీపీ విజయానికి బాగా హెల్ప్ అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు తాను గుర్తించిన వంద నియోజకవర్గాల్లో ధీటైన అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గాల్లో సమీక్షలు కూడా చేపడుతున్నారు అంటున్నారు.