Begin typing your search above and press return to search.

కొత్త రాష్ట్రంలో పాత చంద్రబాబు - 2

By:  Tupaki Desk   |   26 Sep 2015 2:34 PM GMT
కొత్త రాష్ట్రంలో పాత చంద్రబాబు - 2
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో అక్రమాలకు - అవినీతికి మౌనసాక్షిగా నిలిచింది. మరీ ముఖ్యంగా 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాలంలో అవినీతి - అక్రమాలు - దోపిడీ పూర్తిగా వ్వవస్థీకృతమైపోయింది. ప్రభుత్వంలో పెద్దలు - వారికి కావాల్సినవారు - అనుచరులు - ఆశ్రితులు రాష్ట్రం తమ సొంత ఆస్తిలా భావించి కంటికి కనిపించిందంతా కొల్లగొట్టేశారు. గనుల అక్రమాలకైతే అడ్డే లేదు... పరిశ్రమలు - సంస్థలు - సెజ్ ల పేరుతో భూదోపిడీ అంతా ఇంతా కాదు. ప్రపంచంలోని అరుదైన వృక్షాల్లో ఒకటైన ఎర్రచందనం సంపదను కొల్లగొట్టి వేల కోట్లు దోచుకున్నారు. ఇదంతా చాలదన్నట్లుగా ప్రభుత్వ స్థలాలు - ప్రయివేటు స్థలాలు కూడా కబ్జాలు చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు.

... అయితే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. విభజన అనంతరం మిగిలిన నవ్యాంధ్ర పాలన పగ్గాలు చేపట్టారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి డబ్బు అవసరం కావడంతో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే మార్గాలపై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున దారి మళ్లుతున్న ఎర్రచందనం ఆయన కంటపడింది.. అక్రమంగా ఎర్రచందనం నరికేస్తూ లక్షల టన్నుల కలపను విదేశాలకు తరలిస్తున్న స్తానిక, అంతర్జాతీయ ముఠాలను అరికట్టి ఎర్రచందనాన్ని ప్రభుత్వమే విక్రయించేలా ప్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా ఉక్కుపాదం మోపారు... శేషాచలంకొండల్లో ఎప్పుడూ లేనట్లుగా ఎర్రచందనం అక్రమార్కులను ఎన్ కౌంటర్ చేశారు. దీంతో ఎర్రచందనం నరికే కూలీల నుంచి రాష్ట్ర - అంతర్రాష్ట - అంతర్జాతీయ స్మగ్లర్ల వరకు అందరూ వణికిపోయారు. ఇప్పటికీ దేశమంతా వెతికివెతికి ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకుంటున్నారు. రాష్ట్రానికి చెందిన స్మగ్లర్లే కాదు - చైనా - దుబాయి - సింగపూర్ స్మగ్లర్ లనూ భయపెట్టగలిగారు చంద్రబాబు. కేవలం స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విక్రయించే రాష్ట్రానికి కొంత ఆదాయం సంపాదించారు.

అంతా మనోళ్లే..

... కానీ, ఎర్రచందనం విషయంలో కొద్ది నెలల్లోనే పరిస్థితులను చక్కదిద్దగలిగిన చంద్రబాబు అంతకంటే చిన్నదే అయిన ఇసుక మాఫియాను మాత్రం ఏమీ చేయడం లేదు. ఇసుకను కూడా ప్రభుత్వ ఆదాయమార్గంగా మలచుకోవాలన్న ఉద్దేశంతో విధానం మార్చారు. లీజుల స్థానంలో మహిళా సంఘాలకు అప్పగించారు.. రెవెన్యూకు బదులు సెర్ప్ అధికారులకు బాధ్యతలు ఇచ్చారు... సీసీ కెమేరాలు... పరిమితి మేరకు తవ్వకాలు.. చెక్ పాయింట్లు, డీడీలు తీసి ఇసుక తీసుకెళ్లడం ఇలా అంతా పక్కా వ్యవస్త రూపొందించారు. దాంతో ఇసుక అక్రమాలకు చెక్ పడినట్లే అనుకున్నారు అంతా, కానీ, ఇంత పక్కా వ్యవస్థను పక్కదారి పట్టించేశారు చంద్రబాబు వెనుక ఉన్నవారే. మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు ఇసుక దందా మొదలుపెట్టేశారు. సీసీ కెమేరాల్లేవు... ఒక డీడీ తీసి నాలుగు లారీల్లో ఇసుక అమ్మేశారు... అధికారికంగా అమ్మాల్సిన ఇసుకకు కొరత సృష్టించి అనధికారికంగా మూణ్నాలుగు రెట్ల ధర పెంచి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రూపాయి వస్తే... అక్రమార్కులు పది రూపాయలు సంపాదించుకుంటున్నారు. అయినా... చంద్రబాబు మాత్రం ఇసుక అక్రమార్కుల విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదు. కారణమేంటి...? ఎర్రచందనం అంతర్జాతీయ మాఫియానే గడగడలాడించిన ఆయన లోకల్ ఇసుక దందాను ఎందుకు అరికట్టలేకపోతున్నారు అంటే దానికి సమాధానం ఉంది. ఎర్రచందనం మాఫియాలో టీడీపీ నేతల ప్రమేయం లేదు.. ఉన్నా చాలా తక్కువ. అంతా, కాంగ్రెస్ - వైసీపీ నాయకులే ఎర్రచందనం దొంగల్లో ఉన్నారు. కానీ, ఇసుక దందా విషయం వేరు. ఇదంతా ఇప్పుడు టీడీపీ చేతుల్లోనే ఉంది. కొన్ని నదుల పక్కన ఉన్న నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ నేతలూ ఇసుక దందాలో ఉన్నా టీడీపీ నేతల స్థాయిలో లేరు. టీడీపీలో ఏకంగా నలుగురు మంత్రులు... ముగ్గురుఎంపీలు, 36 మంది ఎమ్మెల్యేలు, ఇంకా కొందరు ఎమ్మెల్సీలు ఈ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. రోజుకు సగటున 10 లక్షల ఆదాయం వస్తుండడంతో ఈ అక్రమ వ్యాపారాన్ని వదులుకోవడానికి ఏ ఎమ్మెల్యే కూడా అంగీకరించడం లేదు. దీంతో చంద్రబాబు సొంత పార్టీ నేతలను కంట్రో ల్ చేయలేక చేతులెత్తేశారు. అంతేకాదు... ఇటీవల మీడియాలో ఇసుక మాఫియాపై వార్తలొచ్చినప్పుడు చంద్రబాబు ''సర్లే నడవనీ'' అన్నారని సమాచారం.

ఇసుక అక్రమాల ఫలితంగా నిర్మాణ రంగం దెబ్బతింటోంది. ఇళ్లు కట్టుకునేవారికి ఖర్చు తడిసిమోపెడవుతోంది. వ్యాపారపరంగా బిల్డింగులు నిర్మించేవారు పనులు మానుకుంటున్నారు. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు లక్ష మందికి ఉపాధి దొరకడం లేదు. ఈ సమస్యలన్నిటి నేపథ్యంలో భవన నిర్మాణదారుల సంఘం నిరవధిక నిలుపుదల చేయాలనుకుంది... అన్ని రకాల నిర్మాణ పనులను ఈ సెప్టెబంరు 21 వ తేది నుండి నిలిపివేయాలని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (క్రిడా) నిర్ణయించింది... అయితే... కొరత లేకుండా చూస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వారు విరమించుకున్నారు. వారు ఆందోళన విరమించారేమో కానీ సంక్షభం మాత్రం సమసిపోలేదు.

ఇంత జరిగాకయినా చంద్రబాబు స్పందిచడం లేదు. ఇసుక రీచ్‌లలో విచ్చలవిడిగా సాగుతున్న టీడీపీ నేతల ఇష్టారాజ్యానికి తక్షణమే కళ్లెం వేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటే చంద్రబాబుపై ప్రజల్లో విశ్వాసమేర్పడుతుంది. లేదంటే ఇసుక తుపాను చంద్రబాబును ముంచేయడం ఖాయం.

-గరుడ

Disclaimer: Views expressed in this article are of the writer and do not represent the views of tupaki.com, and not necessarily reflect the opinions of the organisation either.