Begin typing your search above and press return to search.

అతను నీలా దొంగ కాదు జగన్?: చంద్రబాబు

By:  Tupaki Desk   |   26 March 2016 4:52 PM IST
అతను నీలా దొంగ కాదు జగన్?: చంద్రబాబు
X
అసెంబ్లీ వాడివేడిగా సాగింది. మహారాష్ట్రలో జైలు కెళ్లిన దొంగను - ఏపీలో చంద్రబాబు వ్యాపారవేత్తను చేశారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ఈవీఎంను ఎత్తుకెళ్లి అరెస్టయి జైలుకెళ్లిన వ్యక్తికి ఏపీ సర్కారు ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు ఇచ్చిందని, ఇది పెద్ద స్కాం అని జగన్ ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు. జగన్ కు ఏది మంచి, ఏది చెడో గుర్తించే సామర్థ్యం కూడా లేదని, ఎవరైనా ఈవీఎంను ఎత్తుకెళ్లి ఏం చేసుకుంటారని సీఎం ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి జైలుకెళ్లిన మాట నిజమేనని అతను జైలుకెళ్లింది సమాజం కోసమని, జగన్ దొంగతనం చేసి జైలుకెళ్లాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈవీఎంలలో జరుగుతున్న అవతవకలను వెల్లడించేందుకు అతను ఈవీఎంలు తీసుకొచ్చి జైలుకెళ్లారన్నారు. కానీ జగన్ ఎందుకు జైలుకెళ్లారో తను నోటితో చెప్పగలరా అని నిలదీశారు. ఫైబర్ గ్రిడ్ అనేది రాష్ట్ర ప్రతిష్టను పెంచి, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు అన్నారు. ఏపీలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇచ్చే ఉద్దేశంతో చేపట్టిన ఒక టెక్నాలజీ ఉద్యమం అని కొనియాడారు. కేవలం 149 రూపాయలకే ఇంటర్నెట్ ఇపుడు బీఎస్ ఎన్ ఎల్ కూడా ఇవ్వడం లేదని, ఫైబర్ గ్రిడ్ ద్వారా అది సాధ్యమవుతుందని చంద్రబాబు వివరించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఈ ప్రాజెక్టు పూర్తయిందని, మూడేళ్లలో ఏపీలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రాజెక్టు పూర్తయి ఫస్ట్ ఫుల్లీ ఇంటర్నెట్ స్టేట్ గా ఏపీ చరిత్రకెక్కుతుందన్నారు.