Begin typing your search above and press return to search.

బాబు వ‌స్తున్నార‌ని జ‌గ‌న్ ఫ్లెక్సీల్ని తీసేశారు

By:  Tupaki Desk   |   26 Jan 2016 10:11 AM GMT
బాబు వ‌స్తున్నార‌ని జ‌గ‌న్ ఫ్లెక్సీల్ని తీసేశారు
X
గోదావ‌రి జిల్లాల్లో ఫ్లెక్సీల‌తో అభిమానాన్ని చాటుకునే వైఖ‌రి ఎక్కువే. సినిమా న‌టుల నుంచి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కే కాదు.. చిన్న పెద్దా అన్న తేడా లేకుండా అన్ని కార్య‌క్ర‌మాల‌కు ఫ్లెక్సీతో ప్ర‌చారం చేసుకోవ‌టం అక్క‌డో అల‌వాటు. ఈ మ‌ధ్య‌న ఆ పోటీ మ‌రింత‌గా పెరిగిపోవ‌టం.. కొన్ని సంద‌ర్భాల్లో ఫ్యాన్స్ మ‌ధ్య అభిమానం హ‌ద్దులు దాటి గొడ‌వ‌ల వ‌ర‌కూ వెళుతున్న వైనాలున్నాయి.

తాజాగా రాజ‌కీయ పార్టీల మ‌ధ్య ఫ్లెక్సీల వివాదం షురూ అయ్యింది. అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య మొద‌లైన ఈ ఫ్లెక్సీల ర‌చ్చ‌కు కాకినాడ వేదిక‌గా నిలిచింది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా అప్ప‌టికే ఉన్న జ‌గ‌న్ ఫ్లెక్సీల‌ను అధికారులు తొల‌గించ‌టం వివాదంగా మారింది.

ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేపు (బుధ‌వారం) కాకినాడ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న రాక‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తొల‌గించ‌టంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చే్స్తున్నారు. ఫ్లెక్సీల తొల‌గింపు జ‌గ‌న్ స‌భ‌ను అడ్డుకునేందుకే అధికార టీడీపీ ప్ర‌య‌త్నిస్తుంద‌ని జ‌గ‌న్ పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు చిన్న‌వే అయినా అధికార పార్టీ అహంకారాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌న్న భావ‌న క‌లిగించే అవ‌కాశం ఉంది. అలాంటి విమ‌ర్శ‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.