Begin typing your search above and press return to search.

చంద్రబాబు వల్లే సింధుకు పతకమొస్తోందట!

By:  Tupaki Desk   |   19 Aug 2016 11:17 AM GMT
చంద్రబాబు వల్లే సింధుకు పతకమొస్తోందట!
X
ఈ రోజు సాయంత్రం ప్రపంచ నెంబర్ వన్ కరోలినా మారిన్ - తెలుగు తేజం సింధుల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టిస్తుంది. ఆమె విజయం కోసం దేశం యావత్తూ ప్రార్థిస్తోంది. ఒలింపిక్సులో మన పతకాన్ని రెపరెపలాడిస్తారనుకున్న క్రీడాకారులంతా పతకాలు లేకుండా ఉత్త చేతులతో వెనక్కు వస్తున్న సమయంలో సింధు ఇలా స్వర్ణం దిశగా సాగుతుండడంపై దేశవ్యాప్తంగా క్రీడాకారులే కాదు అన్ని రంగాల ప్రముఖుల నుంచి స్పందన వచ్చింది. ప్రధాని మోడీ మొదలుకుని సోనియా - అమితాబ్ - షారుక్ - అమీర్ ఖాన్ - సచిన్ - కోహ్లీ - మాధురి దీక్షిత్ - ప్రియాంక చోప్రా.... ఒకరా ఇద్దరా వేలాదిమంది ప్రముఖులు ఆమె విజయాన్ని కాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. సింధు తెలుగమ్మాయి కావడంతో ఇక్కడి ప్రముఖులూ ఆమె స్వర్ణం గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. అభిమానులు సింధు గెలవాలని ప్రార్థిస్తూ పూజలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే... అందరి స్పందన ఒకలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు స్పందన మరోలా ఉంది. అందరిలానే సింధు విజయాన్ని కాంక్షించిన ఆయన దానికి కొనసాగింపుగా తనకు అలవాటైన తీరులో తన సొంత డబ్బా వేసుకుంటున్నారు. దీంతో సింధును సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతలా పొగుడుతున్నారో చంద్రబాబును అంతే స్థాయిలో విమర్శిస్తున్నారు. సింధు ఒలింపిక్సు పతకం కొట్టడానికి చంద్రబాబు చేసిందేంటో అర్థం కావడం లేదని అంటున్నారు.

ఇంతకీ చంద్రబాబు ఏమన్నారో తెలుసా? జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ - పీవీ సింధు శిక్షకుడు పుల్లెల గోపీచంద్‌ కు తాను గతంలో అందించిన స‌హ‌కార‌మే ఈరోజు దేశానికి ఒలింపిక్స్ పతకం తెచ్చిపెట్టిందని అన్నారు. ఏపీ మెడిటెక్‌ జోన్ పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సులో చంద్ర‌బాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రీడ‌ల‌ను ప్రోత్స‌హిస్తే అత్యుత్త‌మ క్రీడాకారులను త‌యారు చేసిన వాళ్ల‌మవుతామ‌ని అన్నారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు హైద‌రాబాద్‌ లో క్రీడ‌ల అభివృద్ధికి ఎంతో కృషి చేశానని.. ఆ ఫలితమే సింధు విజయమని వ్యాఖ్యానించారు.

అయితే.. చంద్రబాబు వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకుముందు కూడా చంద్రబాబు ఇలా పలు సందర్భాల్లో ప్రతిదీ తన ఘనతే అని చెప్పుకోవడంతో సోషల్ మీడియా సెటైర్లకు దొరికిపోయారు. అయినా, ఇప్పుడూ కూడా ఒలింపిక్సు పతకానికి తన పాలనకు ముడిపెట్టుకుని మురిసిపోయారు. దీంతో సందు దొరికితే చాలు సెల్ఫు డబ్బా వేసుకుంటున్న చంద్రబాబును ఈతరం కుర్రకారు ఏకిపడేస్తోంది. ఒకవేళ చంద్రబాబు వేసిన పునాదుల వల్లే నిజంగా క్రీడారంగం అభివృద్ధి చెందినా అది వేరే ఎవరో చెబితే బాగుంటుంది కానీ ఇలా దేశానికి ప్రతిష్ఠ తీసుకొస్తున్న క్రీడాకారిణి ప్రతిభ కంటే తన ప్రోత్సాహమే గొప్పదన్నట్లు మాట్లాడడం కరెక్టు కాదని అంటున్నారు. చంద్రబాబు ఎప్పటికి మారుతారో ఏమో అంటున్నారు.