Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ రెండు క‌ళ్ల సిద్ధాంతం జ‌పిస్తున్న బాబు

By:  Tupaki Desk   |   1 Jun 2018 10:58 AM IST
మ‌ళ్లీ రెండు క‌ళ్ల సిద్ధాంతం జ‌పిస్తున్న బాబు
X
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరు మ‌రోమారు చ‌ర్చ‌నీయాంశమే కాదు వివాదాస్ప‌దంగా కూడా మారింది. ఇందుకు కార‌ణం చంద్ర‌బాబు నాయుడే కావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌న అవ‌స‌రానికి అనుగుణంగా రాజ‌కీయాలు చేస్తున్న చంద్ర‌బాబు తీరుపై విప‌క్షాలు మండిప‌డుతుండ‌గా...ఒక‌నాటి త‌నకే ప్ర‌త్యేక‌మైన రెండు కళ్ల‌ సిద్ధాంతాన్ని మ‌ళ్లీ టీడీపీ అధ్యక్షుడు తెర‌మీద‌కు తెచ్చారు. గ‌తంలో ఈ విధానాన్ని రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో అమ‌ల్లో పెట్ట‌గా ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల్లో అమ‌ల్లో పెడుతున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణలో తెలంగాణ పాట - ఆంధ్రలో తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర‌కు అనుకూల‌మైన‌ పాట పాడుతూనే ఉన్నారని, అది తాజాగా తారాస్థాయికి చేరింద‌ని తెలంగాణవాదులు విమ‌ర్శిస్తున్నారు. జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించాలని గురువారం ఎల్ రమణ అధ్యక్షతన ఎన్టీఆర్ ట్రస్టుభవన్ లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యం - సూచ‌న మేర‌కే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే, ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ స్వయంగా చంద్రబాబునాయుడు నవ నిర్మాణ దీక్షలు చేపడుతున్నారు. ఏపీలో ఎనిమిది జిల్లాల్లో మహా సంకల్ప బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర విభన రోజైన జూన్‌ 2నుంచి నవని ర్మాణ దీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజుల పాటు నిర్వ‌హించే ఈ దీక్షకు సంబంధించి గురువారం మార్గ దర్శకాలు విడుదల చేసింది

నవనిర్మాణ దీక్షలో భాగంగా గ్రామ పంచాయతీలు - వార్డుల స్థాయిలో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి 5 గంటల వరకు వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలో - మండల స్థాయిలో - మున్సిపల్‌ పరిధిలో ఆయా కమిటీలు పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రజలకు వినిపించాలని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొంది. ప్రోగ్రామ్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీల ఏర్పాటు బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొంది. వివిధ అంశాలపై చర్చించడమే కాకుండా 2018 -19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి స్క్రీన్లను వినియోగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమా లతో పాటు కూచిపూడి నృత్యం, జానపద నృత్యం - పాటలు - సంగీతం - కవులతో భేటీలను నిర్వహించాలని - వ్యాసరచన - ఉపన్యాస పోటీలను కూడా నవనిర్మాణ దీక్షలో భాగంగా నిర్వహించనున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ.. ఏ రోటి కాడ ఆ పాట అన్నట్లుగా ఇంకా ప్రజలను నమ్మించాలనే తపనతో ముందుకు సాగుతోంద‌ని ప‌ల‌వురు దుయ్య‌బ‌డుతున్నారు.