Begin typing your search above and press return to search.

పోల్చి చూస్తే గుండె గుభిల్లుమంటుంది!

By:  Tupaki Desk   |   16 Feb 2018 3:30 PM GMT
పోల్చి చూస్తే గుండె గుభిల్లుమంటుంది!
X
‘‘ఇంతన్నా డంతన్నాడే గంగరాజు.. మేడన్నడు మిద్దెన్నాడే గంగరాజు.. మేడమీద నుయ్యన్నాడే గంగరాజు...’’ అంటూ నమ్మేవాళ్లుంటే గంగరాజులాగా ఎన్ని కబుర్లయినా చెప్పవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తున్న పరిశ్రమలు.. వాటిద్వారా ఆంధ్రప్రదేశ్ యువతరానికి దక్కబోతున్న ఉద్యోగాల గురించిన వివరాలు వెల్లడిస్తున్నప్పుడు.. ఈ ‘గంగరాజు’ కంటె సీఎం చంద్రబాబు ఏమాత్రం తక్కువ తినడం లేదు. ఆయన చెబుతున్నన్ని పరిశ్రమలు అన్నీ కార్యరూపం దాలిస్తే గనుక.. ఖాళీగా మిగిలిపోతున్న ఉద్యోగాలను దక్కించుకోవడానికి ఏపీ లో ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిందే అనిపించేలా సీఎం ప్రకటించారు. అవన్నీ నిజమైతే సగం రాయలసీమ మరికొన్ని ఇతర తీర ప్రాంతాలు.. విపరీతమైన పరిశ్రమలతో నిండిపోతాయని అనుకోవాలి. శుభం. అంతా మంచికే. ఇవన్నీ నిజమైతే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అనుకుందాం.

కాకపోతే.. కొన్ని విషయాలను పోల్చి చూసుకున్నప్పుడు మాత్రం గుండెలు గుభిల్లుమనేలా వాస్తవాలు చేదుగా కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 150 ఎకరాలలో వచ్చే అరవింద్ టెక్స్ టైల్స్ వారు దాదాపు 15వేల ఉద్యోగాలు ఇస్తార్ట. అనంతపురం జిల్లాలో 2 ఎకరాల్లో వచ్చే అపారెల్స్ కంపెనీ మాత్రం రెండువేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. కానీ కియామోటార్స్ అనుబంధ యూనిట్లు అన్నీ కలిపి మరో 15వేల ఉద్యోగాలు ఇవ్వగలవని.. అంటున్నారు. వాళ్లకు కేటాయిస్తున్న భూములు - వారు ఇస్తున్న ఉద్యోగాల మధ్య పొంతన కుదరడం లేదు. దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రతి పరిశ్రమకు అవసరమైన స్థలం - ఇవ్వగల ఉద్యోగాలు ఒకేరీతిగా ఉండవు. ఒకే.

అయితే దక్షిణ కొరియా టౌన్ షిప్ కోసం రెండున్నర వేల ఎకరాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి వారెన్ని ఉద్యోగాలు ఇస్తారో లెక్క తేల లేదు. అలాగే రెండు రోజుల కిందట ఓ పేపర్ ఫ్యాక్టరీ వారు వచ్చి తమకు తీర ప్రాంతంలో రెండున్నర వేల ఎకరాలు ఇస్తే పేపర్ పరిశ్రమ పెడతాం అంటూ ప్రపోజల్ పెట్టడమూ - స్థలం వెతకాలని చంద్రబాబు అధికార్లను పురమాయించడమూ జరిగిపోయింది. ఒక్క కాగితం పరిశ్రమకు రెండున్నర వేల ఎకరాలా? అంటూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతా కలిపి ఒక టౌన్ షిప్ కు సమానమైన భూమి తీసుకుని వారు కాగితం ఫ్యాక్టరీలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరనేది లెక్కతేలడం లేదు. చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న పారిశ్రామిక విధానం - వెల్లడిస్తున్న పెట్టుబడులు - ఉద్యోగాల వివరాలు సామాన్య ప్రజలకు భరోసా కాదు కదా.. భయం కలిగిస్తున్నాయని వారు అనుకుంటున్నారు.

ఇన్ని పరిశ్రమల వివరాలు వెల్లడించినా.. కొత్తరాష్ట్రంలో మూడు నగరాల్లో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడులతో యూనిట్లు పెట్టబోతున్నదని రెండు రోజుల కిందట ప్రకటించిన బాబు అండ్ కో.. ఈ పారిశ్రామిక సమీక్షలో రిలయన్స్ ఊసుకూడా రానివ్వలేదు. మతలబు ఏమిటో మరి!