Begin typing your search above and press return to search.

బీసీల‌కు సున్నం పెట్టిన టీడీపీ

By:  Tupaki Desk   |   3 Jun 2016 3:58 AM GMT
బీసీల‌కు సున్నం పెట్టిన టీడీపీ
X
తెలుగుదేశం పార్టీపై విశ్లేష‌కులే కాదు. సామాన్యుల స్పంద‌న కూడా ఇదే. అదే బీసీల‌కు చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని తెలుగుదేశం పార్టీ సున్నం పెట్టింద‌నే విమ‌ర్శ‌. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు త‌న మూల సిద్ధాంతంగా బడుగులే త‌మ పార్టీ బంధువులు అని ప్ర‌క‌టించారు. కానీ చిత్రంగా తాజాగా టీడీపీ నుంచి పెద్ద‌ల స‌భ‌కు ఎంపిక‌యిన ఎంపీల్లో ఒక్క‌రు సైతం బ‌డుగు - బ‌ల‌హీన‌వ‌ర్గాల లేరు.

ప్ర‌స్తుత అంశానికి వ‌స్తే...తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలే ప్రాణమని మహానాడు వేదికగా ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే టీడీపీ నాయకత్వం తన విధానం మార్చుకుంది. రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో బడుగువర్గాలకు స్థానం లేకుండా, ఇద్దరు ఆగ్రకులాల వారికి స్థానం కల్పించడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రి సుజనా చౌదరి (కమ్మ) - టీజీ వెంకటేష్ (వైశ్య)ను రాజ్యసభ అభ్యర్ధులుగా పార్టీ అధినేత - సీఎం చంద్రబాబు ప్రకటించారు. బీసీ - ఎస్సీలకు స్థానం లేకుండా ఇద్దరు అగ్రకులాలకే అవకాశం కల్పించడం, దానికితోడు ఇద్దరూ వ్యాపారస్తులే కావడంతో వారి ఎంపికపై పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.

అభ్య‌ర్థిగా ఖ‌రారైన సుజనా చౌదరి ఎంపికపై చివరి వరకూ తర్జనభర్జన జరిగింది. ఆయనపై కేసు కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ కొనసాగిస్తారా? అన్న చర్చ జరిగింది. అయితే, చివరకు చంద్ర‌బాబు - లోకేష్ ఆయన వైపే మొగ్గు చూపారు. ఆ మేరకు సీనియర్లయిన యనమల - కేఈ వంటి నాయకులను ఒప్పించారు. ఇక టీజీ వెంకటేష్ పేరు గత కొద్దికాలం నుంచీ వినిపిస్తోంది. గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆయనకు, టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమతోంది. బీసీలకు ఇస్తే నెల్లూరు జిల్లాకు చెందిన యాదవ నేత బీద మస్తాన్‌ రావు - కర్నూలుకు చెందిన బోయ నేత బీటీ నాయుడులో ఒకరికి ఇస్తారన్న సంకేతాలు వచ్చాయి. ఎస్సీలకు ఇచ్చేట్టయితే మాల వర్గానికి చెందిన గుంటూరు జిల్లా నేత - మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్ - చిత్తూరు జిల్లాకు చెందిన మాదిగ వర్గ నేత హేమలతలో ఒకరికి అవకాశం దక్కవచ్చని భావించారు. ఇటీవలి కాలంలో జూపూడి - కారెం శివాజీ వంటి మాల నేతలకు ప్రాధాన్యం ఇచ్చినందున, ఈసారి మాదిగ వర్గానికి చెందిన హేమలతకు అవకాశం దక్కవచ్చని సీనియర్లు కూడా అంచనా వేశారు. కానీ, అటు బీసీ - ఇటు దళితులలో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం ఆ వర్గాలను అసంతృప్తికి గురిచేసింది.

మహానాడులో బడుగులే పార్టీ ప్రాణమని చెప్పి, చివరకు ఆచరణలో తమకు మొండిచేయి చూపించడాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. బాబును కలసి బయటకు వచ్చిన పుష్పరాజ్ - తన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తానని బాబు హామీ ఇచ్చారని, అందుకు కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఎంపిక తర్వాత ఆయన ఆశ ఆవిరయింది. తెలంగాణలో టీఆర్‌ ఎస్ అధినేత - సీఎం కేసీఆర్ తనకు ఉన్న రెండు సీట్లలో ఒకటి బీసీ, మరొకటి ఓసీకి ఇచ్చి సామాజిక సమతుల్యం పాటిస్తే, తమ నాయకత్వం మాత్రం, ఉన్న రెండు సీట్లు ఓసీలకు ఇచ్చిందన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ మూలాలే మ‌రిచిపోయేలా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారా అనేలా చ‌ర్చ జ‌రుగుతోందంటే అసంతృప్తి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవ‌చ్చు.