Begin typing your search above and press return to search.

వృథా ఖర్చులపై జాగ్రత్త పడుతున్నచంద్రబాబు!

By:  Tupaki Desk   |   26 Oct 2015 10:30 PM GMT
వృథా ఖర్చులపై జాగ్రత్త పడుతున్నచంద్రబాబు!
X
అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి ఇన్ని కోట్ల రూపాయలు తగలేయడం అవసరమా? ఈ ఖర్చు సబబేనా? అనే సందేహం ఇప్పటికీ చాలా మంది ప్రజల్లో సజీవంగానే ఉంది. అయితే అమరావతి శంకుస్థాపన విషయంలో అవసరానికి మించి ఖర్చు చేస్తున్నాం అనే విషయంలో చంద్రబాబునాయుడు కూడా తొలినుంచి సరైన క్లారిటీతోనే ఉన్నారు. ఖర్చు శృతిమించిపోతున్నదనే విమర్శలు తారస్థాయికి చేరుకున్న సమయంలో .. ఆ విషయమై ఆయన నోరు విప్పారు. తన మనసులోని మాట చెప్పారు.

''అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్ద దలచుకుంటున్నాం. అంతర్జాతీయ స్థాయి సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి నేపథ్యంలో వారందరి దృష్టిని ఆకర్షించేలా ఈ పండగ ఉండాలి. దీనికోసం చేస్తున్న ఖర్చు మొత్తం మార్కెటింగ్‌ స్ట్రాటెజీ వంటిదే'' అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మార్కెటింగ్‌ అన్న తరువాత.. ఆ పేరుమీద జరిగే ఖర్చును పెట్టుబడిగా చూడాల్సిందే తప్ప.. వృథాగా భావించడం సరికాదు.

అయితే.. శంకుస్థాపన కోసం అంటే.. ఒక క్లియర్‌ విజన్‌ తో అంత డబ్బు ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు అంగీకరించింది కానీ.. మిగిలిన విషయాల్లో వృథా ఖర్చులు పెట్టడానికి ఆయన ససేమిరా అంగీకరించేలా కనిపించడం లేదు. తాజాగా తుళ్లూరు/ అమరావతి ప్రాంతంలోనే ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని డిసైడ్‌ చేసిన స్పీకరు నిర్ణయాన్ని చంద్రబాబు తోసిపుచ్చడానికి కారణం అదే అని సెక్రటేరియేట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీ స్పీకరు కోడెల శివప్రసాదరావు.. అమరావతి శంకస్థాపన జరిగిన వెంటనే.. ఆ ప్రాంతంలో తొలి అధికారిక కార్యక్రమం తనదే కావాలన్నంత పట్టుదలగా.. తాత్కాలిక అసెంబ్లీని 30 రోజుల్లో నిర్మించేసి.. డిసెంబరులో శీతాకాల సమావేశాలు పెట్టేయాలని డిసైడ్‌ చేసేశారు. దీనికి సంబంధించి బెంగుళూరుకు చెందిన ఒక కంపెనీకి.. 12 కోట్ల రూపాయల కాంట్రాక్టును నామినేషన్‌ పద్ధతిపై ఇచ్చేయడానికి కూడా డిసైడ్‌ అయ్యారు. అన్నీ కోడెల అనుకున్నట్లుగ జరిగేట్లయితే.. నవంబరులో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం మొదలై, పూర్తి కూడా అయిపోవాలి. అయితే తాజాగా సోమవారం నాడు కోడెలతో సమావేశం అయిన చంద్రబాబు.. వృథా ఖర్చులను పరిహరించడానికి అసలు అసెంబ్లీని తుళ్లూరుకు తీసుకువెళ్లే ఆలోచన మానుకోవాల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తన మామూలు స్టయిల్లో వృథాలు అరికట్టడానికి తిరిగి రెడీ అయిపోయారని అందరూ అనుకుంటున్నారు.