Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : కాపుల‌కు కోటా క‌ల్పిస్తూ నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   1 Dec 2017 2:52 PM GMT
బ్రేకింగ్ : కాపుల‌కు కోటా క‌ల్పిస్తూ నిర్ణ‌యం
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎట్ట‌కేల‌కు త‌న ఎన్నిక‌ల హామీని మూడున్న‌రేళ్ల త‌ర్వాత నిలుపుకున్నారు. ఏపీలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాపు - తెలగ - బలిజ - ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని కేబినెట్ నిర్ణయించింది. కాపులను బీసీల్లో చేర్చేందుకు గత 30ఏళ్లుగా పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న కీల‌క హామీగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

కాగా, ఈనెల 6 తేదీని కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే డెడ్‌లైన్‌గా కాపు రిజ‌ర్వేష‌న్ స‌మితినాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ తేదీలోగా త‌మ‌కు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాక‌పోతే...ఉద్య‌మం ప్రారంభిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తాజా కేబినెట్ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప‌లువురు భావిస్తున్నారు.

కాగా, మంజునాథ కమిటీ నివేదికపై రేపు అసెంబ్లీలో చర్చిస్తామని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నారు. కాపుల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబునాయుడు గతంలో నుంచి చెబుతూనే ఉన్నారన్నారు. కాపుల కల సాకారం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటామని అన్నం సతీశ్ ప్రభాకర్ అన్నారు. రేపటి శాసనసభలో కాపు రిజర్వేషన్లపై నిర్ణయం ఉంటుందన్నారు. చంద్రబాబు కాపుల గుండెల్లో చిరకాలంగా కొలువై ఉంటారన్నారు.

కాపుల కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వైసీపీ త‌ర‌ఫున గెలిచి టీడీపీలో చేరిన‌ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. మంజునాథ కమిషన్ నివేదికపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

మ‌రోవైపు వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేరుస్తూ ఏపీ మంత్రివర్గం తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏపీ మంత్రివర్గం కేంద్రానికి పంపనుంది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన‌ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.