Begin typing your search above and press return to search.

టీడీపీ 40 - కాంగ్రెస్ 15 లెక్క కుదిరేనా.?

By:  Tupaki Desk   |   10 Sep 2018 8:31 AM GMT
టీడీపీ 40 - కాంగ్రెస్ 15 లెక్క కుదిరేనా.?
X
చరిత్రలోనే పెద్ద తప్పు చేసేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో దాదాపు కనుమరుగైన తన పార్టీ ఉనికిని పొత్తు పొడుపులతో బతికించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. టీడీపీ సానుభూతి పరులు వద్దంటున్నా.. తెలుగు ప్రజలు ఇది తప్పు అని ఘోషిస్తున్నా కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు ముందడుగు వేయడం సగటు టీడీపీ అభిమానిని వేధిస్తోంది.

అయితే చంద్రబాబు కాంగ్రెస్ తో సావాసం చేసేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేలా చర్చలు జరుపుతున్నారు. సీఎం చంద్రబాబుతో తాజాగా కాంగ్రెస్ నేతలు చర్చలు మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు తనకు ఇంకా తెలంగాణలో టీడీపీ బలం ఉందని భ్రమపడుతున్నట్టు తెలిసింది. అందుకే బీరాలకు పోయి తెలంగాణలో 40 సీట్లు కావాలని అడుగుతున్నారట.. ఇంత భారీగా అడిగితే 20 సీట్లు అయినా ఇస్తారని చంద్రబాబు స్కెచ్ గీసినట్లు సమాచారం. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం టీడీపీకి తెలంగాణలో అంత సీన్ లేదని.. 15 సీట్లే ఎక్కువ అని చెబుతున్నారట.. మరో రెండు రోజుల్లోనే కాంగ్రెస్-టీడీపీ సీట్ల కసరత్తు పూర్తయ్యి ఏదో ఒక లెక్క ఫైనల్ కావచ్చని సమాచారం అందుతోంది.

చంద్రబాబు లెక్క మాత్రం వేరేలా ఉంది. రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ నేతను కాంగ్రెస్ లోకి పోయేలా చేసిన తనకు.. అంత తక్కువ సీట్లు సాధ్యం కాదని.. 20 సీట్లు అయినా ఖచ్చితంగా కావాలని భావిస్తున్నాడట. ఇందుకోసం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

నిజానికి టీఆర్ ఎస్ పార్టీ మాతృకే టీడీపీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ టీడీపీ నేతలు తలసాని - కడియం - తుమ్మల సహా అంతా టీడీపీ నుంచి వచ్చిన వారే.. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కు స్వయంగా టీడీపీ అధినేత ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు. ఇలా టీడీపీకి అనుకూలంగా ఉన్న టీఆర్ ఎస్ ను కాదని చంద్రబాబు కాంగ్రెస్ వెంట నడవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా సెటిలర్లు ఎవరికీ మద్దతిస్తారనే ఆసక్తి అందిరిలోనూ ఉంది. తెలుగుదేశం సిద్ధాంతాలను తుంగలో తొక్కిన బాబుకు ఓటేస్తారా.? లేక అంతా టీడీపీ నేతలే ఉన్న టీఆర్ ఎస్ ను అక్కున చేర్చుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది.