Begin typing your search above and press return to search.

‘సింధు’ నజరానాలో చంధ్రుళ్ల మధ్య పోటీ

By:  Tupaki Desk   |   20 Aug 2016 9:15 AM GMT
‘సింధు’ నజరానాలో చంధ్రుళ్ల మధ్య పోటీ
X
రియో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి రజత పతకాన్ని అందించిన తెలుగమ్మాయ్ సింధు. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో రజతపతకాన్ని సొంతం చేసుకున్న ఆమెకు ఇప్పటికే పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అందరి సంగతి ఎలా ఉన్నా.. సింధుకు నజరానాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పోటీ నడుస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సింధు మూలాలు ఆంధ్రా అయితే.. ప్రస్తుతం ఆమె ఉంటున్నది తెలంగాణలో. రాష్ట్రాల సరిహద్దుల్ని సింధు లాంటి ‘సిల్వర్ స్టార్’కు అంటించటాన్ని పక్కన పెడితే.. ఒక తెలుగు అమ్మాయి సాధించిన ఈ అద్భుతానికి ఇద్దరు చంద్రుళ్లు ఎంతలా రియాక్ట్ అవుతారాన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

సింధుకు ఎంత నజరానా ఇవ్వాలన్న అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. మరోవైపు సింధుకు నజరానా విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యింది లేదు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. నజరానాలు ప్రకటించే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత ఉదారంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ మధ్య అంతర్జాతీయ టైటిల్స్ సాధించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు రెండు సార్లు.. రూ.కోటి చొప్పున నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. టెన్నిస్ టైటిల్ కే రూ.కోటిని ప్రకటిస్తే ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ రజతానికి కేసీఆర్ ఎంత ప్రకటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నజరానా విషయంలో తెలంగాణకు చెందిన కీలక నేత మాట ప్రకారం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నజరానా ప్రకటించిన తర్వాత కేసీఆర్ ప్రకటిస్తారని.. బాబు కంటే ఎక్కువే ఆయన ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

ఇక.. బాబు విషయానికి వస్తే.. తెలంగాణ ప్రభుత్వంతో పోటీ పడలేని చంద్రబాబు.. తనకున్న ఆర్థిక పరిమితుల కారణంగా.. వెంటనే స్పందించానన్న పేరును సొంతం చేసుకునే దిశగా ఆలోచిస్తూ.. వెంటనే నజరానాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. సింధుతో పాటు.. ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కు కూడా నజరానా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్టన్లు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఈ నజరానా విషయంలో ఇద్దరు చంద్రుళ్లలో ఎవరి అధిక్యంలో నిలుస్తారన్న విషయం అందరిలో ఉత్కంట రేపుతోంది.