Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు మీకు జనాలు పట్టరా..?

By:  Tupaki Desk   |   11 Jun 2015 4:20 AM GMT
చంద్రుళ్లు మీకు జనాలు పట్టరా..?
X
రెండు రోజులు తక్కువగా రెండు వారాలు. ఇదేం చిన్న కాలం కాదు. కాస్త అటూఇటూగా నెలలో అర్థభాగం. గత రెండు వారాలుగా ఒక అంశం రెండు తెలుగు రాష్ట్రాల్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. తెలంగాణలో ఆ మధ్య ముగిసిన ఓటుకు నోటు యవ్వారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి రూ.5కోట్లు ఆఫర్‌ చేయటం.. అందులో భాగంగా రూ.50లక్షలు అడ్వాన్స్‌ రూపంలో టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఆఫర్‌ ఇచ్చి అడ్డంగా దొరికిపోవటం తెలిసిందే.

ఇలా మొదలైన ఈ ఇష్యూ రేవంత్‌రెడ్డితో ముగిసిపోకుండా.. ఈ వివాదం రోజులు గడిచే కొద్దీ మరింత ముదిరిపోతుంది. గడిచిన నాలుగురోజుల్లో ఇప్పటికి రెండుసార్లు రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు బండబూతులు మినహా.. మిగిలిన అన్ని విధాలుగా తిట్టేసుకున్నారు. ఈ తిట్లు తిట్టటంతో కేసీఆర్‌ కాస్త ముందున్నారు. మాటల దాడితో చంద్రబాబు కాస్తంత పూర్‌ కావటంతో ఆయన వెనుకబడి ఉన్న పరిస్థితి.

ఈ విషయాన్ని పార్టీలకు.. వ్యక్తులకు సంబంధం లేకుండా.. ఎలాంటి ప్రేమాభిమానాలు.. భావోద్వేగాలు మనసులో పెట్టుకోకుండా కాసింతసేపు జరుగుతున్న పరిణామాల్ని ఎవరికి వారుగా సాపేక్ష దృష్టితో చూస్తే.. ఒక్క విషయం అర్థమవుతుంది. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ముఖ్యమంత్రులు ఒకరిని ఒకరు రాజకీయంగా దెబ్బ తీసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ వ్యవహారం ఇప్పుడు ఎంతవరకూ వచ్చిందంటే.. ఎవరికి వారు తమ తమ రాజకీయ ప్రత్యర్థుల సంగతి ఓ రేంజ్‌లో చూసేయాలని డిసైడ్‌ అయ్యేవరకు వెళ్లిందని చెప్పుక తప్పదు. దీనికి.. బుధవారం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా చంద్రబాబు.. కేసీఆర్‌లు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. విషాదకరమైన అంశం ఏమిటంటే.. తమ రాజకీయ అస్తిత్వం కోసం ఇరు ప్రాంతాలకు చెందిన రాజకీయ అధినేతలు తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు.

తమను తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్న అధినేతల్ని వదిలిపెట్టకుండా మరింత అడ్డదిడ్డంగా మాట్లాడేందుకు వారు ఎవరికి వారుగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఇన్ని తెలివితేటలు ప్రదర్శిస్తున్న ఈ చంద్రుళ్లు ఇద్దరు తమకు ఓట్లు వేసి.. గెలిపించి.. అధికారాన్ని ఇచ్చిన ప్రజల గురించి ఇంతగా ఎప్పుడూ కోట్లాడలేదన్నది నిజం.

కానీ.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం మిగిలిన అంశాల్ని వదిలేసి.. ఈ వ్యవహారంపై దృష్టి పెడుతున్న ఈ ఇద్దరు చంద్రుళ్లు.. తమ ప్రజల గురించి ఇంత సీరియస్‌గా ఎందుకు రియాక్ట్‌ కాలేదు? ఎందుకు స్పందించలేదు? లాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడున్న హైటెన్షన్‌ టైంలో ఇలాంటి ప్రశ్నలు వేసిన వారిని కాస్త చిత్రంగా చూడొచ్చు కానీ.. ఇద్దరు అధినేతల మధ్య నడుస్తున్న ప్రత్యక్ష పోరాటం పుణ్యమా అని రెండు రాష్ట్రాల్లోని అభివృద్ధి కార్యక్రమాలను.. ప్రజల్ని పెద్దగా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఇద్దరు చంద్రళ్లు ఏమంటారో..?