Begin typing your search above and press return to search.

మాకొద్దంటున్న ‘బాబు’ను చంద్రబాబు ఏం చేస్తారో?

By:  Tupaki Desk   |   14 Jun 2022 3:30 PM GMT
మాకొద్దంటున్న ‘బాబు’ను చంద్రబాబు ఏం చేస్తారో?
X
తెలుగుదేశం పార్టీలో ఒక దరిద్రపుగొట్టు కల్చర్ కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి తిరిగే తమ్ముళ్లు.. పార్టీ ఓడిపోయి విపక్షంలో ఉన్నప్పుడు తూటాకు దొరకనంత దూరంగా ఉండిపోతారు. అసలు వారు పార్టీలో ఉన్నారా? లేరా? అన్న సందేహం పలువురిలో కలుగుతుంది.

ఇలాంటి నేతలు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయన్న వేళ.. కలుగులో నుంచి బయటకు వచ్చే ఎలుకల మాదిరి బయటకు వచ్చేస్తుంటారు.టికెట్ల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయటం.. సెంటిమెంట్ చిందించి చివరి క్షణంలో టికెట్లను సొంతం చేసుకోవటం కొంతకాలంగా నడుస్తూనే ఉంది. పవర్ లో పక్కనుండే నేతలు. కష్టాల్లో మాత్రం పత్తా లేకుండా పోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెబుతుంటారు చంద్రబాబు. గంభీరమైన డైలాగులు చెప్పినప్పటికీ.. తీరా ఎన్నికల వేళకు అలాంటి నేతలకే ప్రాధాన్యత లభించటానని తెలుగు తమ్ముళ్లు పలువురు జీర్ణించుకోలేని పరిస్థితి.

ఇప్పుడు మాగంటి బాబు విషయంలోనూ అలానే జరుగుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఏలూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే ఆయన.. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పత్తా లేకుండా పోవటం తెలిసిందే. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకున్నఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నట్లుగా చెప్పాలి.

ఈ అంశాన్ని పక్కన పెడితే.. గతంలోనూ ఆయన తీరును పలువురు తప్పు పడుతున్నారు. 2014లో టీడీపీ ఎంపీగా వ్యవహరించిన సమయంలోనూ ఆయన టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో అస్సలు పొసిగేది కాదంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉంటూ.. వైఎస్ హయాంలో మంత్రిగా వ్యవహరించిన మాగంటి బాబు కారణంగానే 2019 ఎన్నికల్లో పోలవరం.. చింతలపూడి.. కైకలూరు నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం వాటిల్లిందన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తున్న పరిస్థితి.

సరిగ్గా ఎన్నికల సమయానికి కాస్త ముందుగా యాక్టివ్ అయిపోయే మాగంటి.. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల సమయంలోనూ.. ఇతర సందర్భాల్లో ఏమై పోయారన్న ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. పార్టీ పవర్లో లేనప్పుడు అంటీముట్టనట్లుగా ఉండి.. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చే వేళకు మాత్రం పార్టీలో యాక్టివ్ అయ్యే నేతల విషయంలో చంద్రబాబు కటువుగా వ్యవహరించాలంటున్నారు. ఇటీవల ముగిసిన మహానాడులోనూ.. ‘తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తాన్ని నింపి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేస్తాం’ అని చంద్రబాబు.. లోకేశ్ చెప్పిన మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటూ మాగంటి బాబు లాంటి వారికి టికెట్లు ఇవ్వకూడదంటున్నారు.

పార్టీ ఎదుగుదల విషయంలో కమిట్ మెంట్ లేని నేతలకు పెద్దపీట ఎలా వేస్తారన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఆ మాటకు వస్తే మాగంటి బాబు లాంటి మరికొందరు నేతలు ఉన్నారని.. అలాంటి వారి విషయంలోనూ చంద్రబాబు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. పార్టీకి దూరంగా ఉంటూ.. వర్గపోరును పెంచి పోషించే నేతల్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే.. చేతికి అంది వచ్చిన ఇద్దరు కుమారుల్ని వెంటవెంటనే పోగొట్టుకున్న మాగంటి బాబు విషయంలో చంద్రబాబు ఎమోషనల్ అయితే ఆయనకు మళ్లీ టికెట్ రావటం ఖాయమంటున్నారు. కొత్తరక్తంతో పార్టీని పరుగులు తీయిస్తానని మాటల్లో చెప్పే చంద్రబాబు చేతల్లో ఏం చేసి చూపిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.