Begin typing your search above and press return to search.

చిరకాల మిత్రులను బాబు వదిలించుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   16 April 2017 5:44 AM GMT
చిరకాల మిత్రులను బాబు వదిలించుకుంటున్నారా?
X
గత కొంతకాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు తన చిరకాల మిత్రులను వదిలించుకోవాలని చూస్తున్నట్లుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తొలినాళ్ల నుంచి ఆయన వెన్నంటి ఉన్నవారిని వదులుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సొంత జిల్లా చిత్తూరుకు చెందిన నేతలను ఆయన పూర్తిగా పక్కన పెడుతున్నారని చెబుతున్నారు.

30 సంవత్సరాల కిందట చంద్రబాబు చిత్తూరు జిల్లా నుంచి యువనేతగా రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయనకు అత్యంత ఆప్తమిత్రులుగా, ఉండి, ఆయనతో పాటే రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చిన ముగ్గురు నేతలతో ఇప్పుడు ఆయనకు సంబంధాలు బెడిసికొడుతుండడంతో ఎందుకిలా జరుగుతోందన్న ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారా... అలా అయితే అందుకు కారణమేంటన్న విషయంలో చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు చర్చించుకుంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి - శివప్రసాద్ - గాలి ముద్దుకృష్ణమనాయుడులతో ఉన్నది ఈ నాటి స్నేహం కాదు. వారిది మూడున్నర దశాబ్దాల అనుబంధం. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా వీరి మధ్య స్నేహం మాత్రం చెడలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నిజం చెప్పాలంటే, మిగతా ముగ్గురూ చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయనపై మండిపడుతున్నారు.

అనారోగ్యం పేరు చెప్పి తనను పట్టించుకోవడం లేదని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి - ఎంతో సీనియర్ ను అయిన తనకు తగిన బాధ్యతలు అప్పగించడం లేదని గాలి ముద్దు కృష్ణమనాయుడు బహిరంగ వ్యాఖ్యలు చేయగా, తాజాగా, శివప్రసాద్ సైతం ఇదే దారిలో నడిచారు. చంద్రబాబు కూడా వారిని ఊరడించేందుకు స్వయంగా ఏమీ ప్రయత్నాలు చేయడం లేదు. బొజ్జల విషయంలో కాస్త మంత్రులను వారిని పంపించి చర్చలు జరిపినా శివప్రసాద్ విషయంలో చంద్రబాబు కూడా తెగే దాకా లాగే పద్ధతిలోనే మాట్లాడారు. శివప్రసాద్ పై ప్రత్యారోపణలు చేసి మరింత రెచ్చగొట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/