Begin typing your search above and press return to search.

చ‌లో విజ‌య‌వాడ ఆగ‌దు.. ఏం చేస్తారో చేసుకోండి: స‌ర్కారుపై ఉద్యోగుల ఫైర్‌

By:  Tupaki Desk   |   2 Feb 2022 11:30 AM GMT
చ‌లో విజ‌య‌వాడ ఆగ‌దు.. ఏం చేస్తారో చేసుకోండి:  స‌ర్కారుపై ఉద్యోగుల ఫైర్‌
X
ఉద్యోగుల‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం మ‌రింత ముదిరింది. త‌మ హ‌క్కుల సాధ‌న‌లో చ‌లో విజ‌య‌వాడ‌కు పిలుపునిచ్చిన ఉద్యోగుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వం అరెస్టు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే... దీనిపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు తీవ్రంగానే స్పందించారు. ఎంత మందినైనా అరెస్టు చేసుకోండ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. క‌నీసం ప‌ది మందితో అయినా.. స‌భ‌ను, చ‌లో విజ‌య‌వాడ‌ను నిర్వహించి తీరుతామ‌ని చెప్పారు.

ప్రభుత్వ తప్పుడు లెక్కలతో ఉద్యోగుల వేతనాలు చెల్లించి.. జీతాలు పెరిగాయన్న అపోహ కల్పిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. పీఆర్సీ తగ్గిస్తే జీతాలు ఎలా పెరుగుతాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. పాత బకాయిలను పేస్లిప్పుల్లో చూపించి జీతాలు పెరిగినట్లు భ్రమింప జేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా చనిపోయిన వారికి సైతం జీతాలు చెల్లించేశారని మండిపడ్డారు. చలో విజయవాడకు అనుమతి ఇచ్చి మళ్లీ ఇప్పుడు నిరాకరించారని.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఉద్యోగులు పెద్దఎత్తున తరలివస్తారని నేతలు తెలిపారు.

``వేతన స్కెల్పై దొంగ లెక్కలు చెప్పి మోసం చేయొద్దు.. ఐఏఎస్ అధికారులకు ఉద్యోగులంతా తెలివి తక్కువ వాళ్ళలా కనిపిస్తున్నామా. ఏమి తెలియకుండానే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామని అధికారులు భావిస్తున్నారా? ఘర్షణ వైఖరి విడనాడి ప్రభుత్వం సానుకూల ధోరణి అవలంబించాలి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో.. చలో విజయవాడపై సీపీ నిర్ణయం వెనక్కు తీసుకున్నారు. ఎంత అణగదొక్కయాలని చూస్తే ఉద్యమం అంత ఉద్ధృతమవుతుంది`` అని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు.

ప్రభుత్వం నిర్బంధం విధించినా 'చలో విజయవాడ' కార్యక్రమం నిర్వహించి తీరుతామ‌ని, ఉద్యోగులు తమ వేతన స్లిప్లను అగ్గి మంటతో కాదు కడుపు మంటతో తగుల బెట్టారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణరావు అన్నారు. రివిజ్డ్ పే స్కెల్ వేసే తొందరలో మనుషులు చేసే పనిని మిషన్ల ద్వారా చేసి ప్రభుత్వం తప్పులు మీద తప్పులు చేస్తోంది.. మాట మీద లేని ప్రభుత్వం అంతా రివర్స్ చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన వేతనాలను, పెన్షన్ లను ఎవరూ హర్షించటం లేదని గుర్తించాలి.. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని విమ‌ర్శించారు.

ప్రభుత్వానికి మాట మార్చే, మనసు మార్చుకునే జబ్బు వచ్చిందని, కరోనా కంటే దాని తీవ్రత ఎక్కువ.. ముందు అనుమతి ఉందని చెప్పి ఇప్పుడు లేదంటున్నారు. ప్రభుత్వం చేసిన గాయం కంటే కరోనా తీవ్రమైందేమీ కాదు.. అందరినీ అరెస్ట్ చేసినా కనీసం 10 మందితోనైనా ఉద్యమం నిర్వహించి తీరుతామ‌ని పీఆర్సీ సాధ‌న స‌మితి నేత బండి శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.