Begin typing your search above and press return to search.

కేసీఆర్ ముక్కు నేల‌కు రాయాల్సిన టైం వ‌చ్చింది

By:  Tupaki Desk   |   6 Jan 2017 7:36 AM GMT
కేసీఆర్ ముక్కు నేల‌కు రాయాల్సిన టైం వ‌చ్చింది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై క‌మ్యూనిస్టు పార్టీలు మండిప‌డ్డాయి. సీపీఎం ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన మ‌హాజ‌న పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ కామెంట్ల‌ను గుర్తుచేశారు. "సీపీఎం నేతలు ముక్కు నేలకు రాసి పాదయాత్ర ప్రారంభించాలని అన్నవ్‌.. 81రోజులపాటు 2వేల 150కిలోమీటర్లు అప్రతిహాతంగా పాదయాత్ర చేశారు.. ఇప్పుడు ముక్కె వరు నేలకు రాయాలో నీవే చెప్పాలి" అని చాడ వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. సీపీఎం పాదయాత్రకు చాడ సంఘీభావం తెలిపి కలిసి నడిచారు. ఈ సందర్భంగా సభలో చాడా మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు చెప్పేదే చేస్తారు.. చేసేదే చెబుతారన్నారు. పాదయాత్రతో ఎస్సీ - ఎస్టీ - బీసీ - ఓబీసీ - మైనార్టీల్లో ఆశలు రేకెత్తుతున్నాయని చెప్పారు. ప్రజల్లో చైతన్యం రగిల్చేందుకు ఈ పాదయాత్ర సాగుతుందన్న విషయం ప్రభుత్వం మరిపోవద్దు అన్నారు. సామాజిక న్యాయం జరగకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల వల్లే తెలంగాణ వెనకబడిందని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ఎవరి పాలనలో ప్రజలకు అన్యాయం జరుగుతుందో చెప్పాలని చాడా వెంక‌ట‌రెడ్డి ప్రశ్నించారు. మొట్టమొదటి మంత్రివర్గంలో 43 అంశాలపై తీర్మానాలు చేయగా ఏ మేరకు అమలయ్యాయో చెప్పాలన్నారు. ఇటీవల ఓయూలో జరిగిన విద్యార్థుల బహిరంగ సభలో ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపించలేదని చాడా అన్నారు. డబుల్‌ బెడ్‌ రూం - 3 ఎకరాల భూమి అటకెక్కిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 69లక్షల కోట్లు అప్పులు ఉంటే.. ఇప్పుడు తెలంగాణలో లక్ష కోట్లకు పెరిగిందని చాడ‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. దొరల మెడలు వంచి భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందని గ‌తం గుర్తు చేశారు. బతుకులు మారాలంటే పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ నోట్ల మార్పిడి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని విధంగా ఉందని విమ‌ర్శించారు. కుబేరుల వద్దే డబ్బుల కట్టలు ఉన్నాయని - సామాన్యులే తిప్పలు పడుతున్నారని...నోట్ల రద్దు దొంగలు..దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్టుందని అన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ .... 123 జీవోపై రైతుల భూములు సేకరించొద్దని హైకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదనీ, ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ది రావాలనీ అన్నారు. సామాజిక ఎజెండాపై సకల శక్తుల్నీ ఏకం చేసి ఎర్రజెండా సత్తా చూపుతామన్నారు. కమ్యూనిస్టులు వేరు కాదని ఎర్రజెండా ఒక్కటే అన్న విషయం పాలకులు మరిచిపోవద్దని వీర‌భ‌ద్రం అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని 70ఏల్లు పాలించిన కాంగ్రెస్‌ - టీడీపీలు ప్రజల్ని మోసం చేస్తే, రెండున్నరేండ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రజల్ని మోసం చేస్తోందని విమ‌ర్శించారు. పాలకులు మారినంత మాత్రాన మార్పు రాదని, పాలకుల పద్ధతి మారాలని అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల గురించి ఆలోచించే పార్టీలను ప్రజలు ఆదరించాలని ఆయ‌న‌ కోరారు. కమ్యూనిస్టులకు వీరోచిత పోరాటాలు చేసిన చరిత్ర ఉందన్నారు. రాష్ట్రానికి కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమని, ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు ఏకమై పోరాటాలు చేస్తాయని చెప్పారు. చాడా వెంకట్‌రెడ్డి అభినందన పాదయాత్రకు మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. 4వేల కిలోమీటర్లు పూర్తి చేసి మార్చి 19న ప్రభుత్వాన్ని హైదరాబాద్‌ సభలో కడిగేస్తామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/