Begin typing your search above and press return to search.

కొత్తగా మొదలైన సర్టిఫికేట్ వార్

By:  Tupaki Desk   |   6 Jun 2021 10:30 AM GMT
కొత్తగా మొదలైన సర్టిఫికేట్ వార్
X
మన దేశంలో వివాదాలకు ఏ విషయం కూడా మినహాయింపు కాదు. తాజాగా పశ్చిమబెంగాల్లో మొదలైన సర్టిఫికేట్ వార్ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే బెంగాల్ కు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే బెంగాల్లో 18-45 ఏళ్ళ మధ్యలో కోవిడ్ టీకాలు వేయించుకునే వాళ్ళకు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తోంది. ఆ సర్టిపికేట్ లో మమతా బెనర్జీ ఫొటో ఉంటోంది. ఈ విషయంపైనే బీజేపీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తంచేసింది. దాంతో బీజేపీ-తృణమూల్ నేతల మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. 45 ఏళ్ళు దాటిన వారు వేసుకునే టీకా సర్టిఫికేట్లపై నరేంద్రమోడి బొమ్మ ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదే విషయమై తృణమూల్ నేతలు తమ వివరణ ఇచ్చారు. బెంగాల్లో 18-45 ఏళ్ళలోపు వారు వేసుకునే టీకాలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తోందట. 45 దాటిన వాళ్ళు వేసుకునే టీకా సర్టిఫికేట్లపై మోడి ఫొటో ఉండటాన్ని ప్రస్తావించారు. అదే పద్దతిలో 18-45 ఏళ్ళలోపు వారు వేసుకునే టీకా సర్టిఫికేట్లపై మమత ఫొటో ఉంటే తప్పేంటని ఎదురు దాడి చేస్తున్నారు.

ఇదే పద్దతిలో పంజాబ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రుల ఫొటోలే ఉంటున్న విషయాన్ని తృణమూల్ నేతలు గుర్తుచేశారు. పై రాష్ట్రాల విషయంలో బీజేపీకి లేని అభ్యతరాలు ఒక్క బెంగాల్ విషయంలో మాత్రమే ఎందుకని నిలదీస్తున్నారు. బెంగాల్లో జరిగే ప్రతి చిన్న విషయానికి బీజేపీ నేతలు కావాలనే పెద్ద గోల చేస్తున్నారంటూ తృణమూల్ నేతలు మండిపోతున్నారు. మరి కొత్తగా మొదలైన సర్టిఫికేట్ వార్ ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.