Begin typing your search above and press return to search.

నీతి ఆయోగ్ ప్ర‌క‌ట‌న‌: లాక్‌ డౌన్ లేకుంటే ప్ర‌మాదంలో భారత్

By:  Tupaki Desk   |   23 May 2020 10:30 AM GMT
నీతి ఆయోగ్ ప్ర‌క‌ట‌న‌: లాక్‌ డౌన్ లేకుంటే ప్ర‌మాదంలో భారత్
X
మహమ్మారి వైర‌స్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నాలుగో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. అయినా వైర‌స్ ప్ర‌భంజ‌నం త‌గ్గ‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వాల‌పై ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న ప‌రిస్థితి. లాక్‌డౌన్ విధించి ఏం సాధించారు? అనే ప్ర‌శ‌న‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో నీతి ఆయోగ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. లాక్‌డౌన్ విధించ‌డంతో స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని, వైర‌స్ విజృంభ‌ణ‌ను కొన్నాళ్లు నియంత్రించామ‌ని ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్‌తో చాలా ప్రయోజనం చేకూరిందని తెలిపింది. ఈ సంద‌ర్భంగా వివిధ నమూనాలను శుక్ర‌వారం వెల్లడించింది.

లాక్‌డౌన్ విధించకపోతే దేశంలో ఇప్పటి వరకు 14 నుంచి 29 లక్షల మంది వైరస్ బారినపడిన ఉండేవార‌ని తెలిపింది. వీరిలో 37,000 నుంచి 78,000 మంది ప్రాణాలు కోల్పోయేవారని వెల్ల‌డించింది. లాక్‌డౌన్ మొదటి, రెండు దశలపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ విశ్లేషించాడు. ఆ రెండు లాక్‌డౌన్‌లు వైరస్ వ్యాప్తిని గణనీయంగా అడ్డుకున్నాయని ప్ర‌క‌టించారు.

ఏప్రిల్ 3వ తేదీ వ‌ర‌కు 22.6 శాతం కొత్త కేసులతో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంద‌ని, కానీ ఏప్రిల్ 4 తర్వాత భారీగా తగ్గి 5.5 శాతానికి చేరిందని వివ‌రించారు. మార్చి 25వ తేదీన సరైన సమయంలో లాక్‌డౌన్ ప్రకటించార‌ని తెలిపారు. ఆ లాక్‌డౌన్ వైరస్ వ్యాప్తిని గణనీయంగా అడ్డుకుంద‌ని ప్ర‌క‌టించారు. లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి నిలిచిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో వైద్య సౌకర్యాలు, ఔషధాలు, కోవిడ్-19 స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు, వెంటిలేటర్లు సమకూర్చుకోవడం, పీపీఈ కిట్ల తయారీ లాంటి అత్యవసర వ‌స‌తులు ఏర్పాటుచేయ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డింద‌ని వివ‌రించారు. లాక్‌డౌన్ పెద్ద సంఖ్యలో మరణాలు, పాజిటివ్ కేసులను అడ్డుకోగలిగిందని, తక్కువ మందికి వైరస్ సోకిందని డాక్టర్ పాల్ చెప్పారు.

ఒక‌వేళ లాక్‌డౌన్ విధించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందోన‌ని ఆ విష‌యాలు కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ వెల్లడించారు. దీనిపై ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్- పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థికవేత్తలు, పరిశోధకులు నివేదిక రూపొందించార‌ని తెలిపారు. బీసీసీ నివేదిక ప్రకారం.. లాక్‌డౌన్ కారణంగా 36 నుంచి 70 లక్షల కేసులు, 1.2-2.1 లక్షల మరణాలు నివారించగలిగిన‌ట్లు ప్ర‌క‌టించారు.

పీహెచ్‌ఎఫ్‌ఐ : 78,000 మరణాలను నివారించినట్లు అంచనా.
ఆర్థిక‌వేత్త‌ల అంచ‌నా: లాక్‌డౌన్ లేకుంటే 23 లక్షల కేసులు, 68,000 మరణాలు జ‌రిగేవ‌ని వెల్ల‌డి.
రిటైర్డ్ శాస్త్రవేత్తలు, ఎపిడిమియాలజిస్ట్‌ల నివేదిక‌: 15.9 లక్షల కేసులు, 51,000 మరణాలను నివారించగలిగిన‌ట్లు అంచ‌నా.
గణాంక శాఖ, ఐఎస్ఐ నివేదిక‌: 20 లక్షల కేసులు, 54,000 మరణాలు లాక్‌డౌన్‌తో త‌గ్గాయ‌ని వెల్ల‌డి.