Begin typing your search above and press return to search.

జగన్ కి వార్నింగ్ ఇచ్చిన సెంట్రల్ మినిష్టర్

By:  Tupaki Desk   |   27 Oct 2015 9:02 AM GMT
జగన్ కి వార్నింగ్ ఇచ్చిన సెంట్రల్ మినిష్టర్
X
ప్రత్యేక హోదాపై ఉద్యమం అంటూ ఒక్కసారిగా హడావుడి చేసిన జగన్ ఇప్పడు చల్లబడిపోయారు. వారం రోజులు నిరాహార దీక్ష చేసి నిస్సత్తువతో నీరసించిపోయారు. ప్రకటనలు, ఉత్తుత్తి మాటలు తప్ప గట్టి పోరాటమే ఆయన వైపు నుంచి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో జగన్ ప్రత్యేక పోరు పని అయిపోయినట్లేనన్న వాదన వినిపిస్తోంది. అయితే... అంత ఆర్భాటం చేసి మొదలు పెట్టిన ఈ ప్రత్యేక హోదా పోరాటం నుంచి జగన్ ఎందుకు వెనక్కు తగ్గారు..? ఆయనపై పనిచేసిన ప్రభావమేంటి..? అన్న ప్రశ్నలకు వైసీపీ నుంచే సమాధానం వస్తోంది. ఢిల్లీ నుంచి ఫోనొచ్చింది... మా సార్ వాయిస్ డల్ అయింది అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారట.

ప్రత్యేక హోదా విషయంలో ఏపీలోని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాలని... అందుకు కాంగ్రెస్ తో కలవాలని జగన్ అనుకుంటున్నట్లు కేంద్రం తెలుసుకుందని.. అదే కనుక జరిగితే చంద్రబాబు ఒక్కడే కాకుండా కేంద్రం కూడా ఇబ్బంది పడుతుందని భావించి ఎలాగైనా జగన్ కు కళ్లెం వేయాలని కేంద్రం ప్లాన్ చేసినట్లు వినిపిస్తోంది. దీంతో జగన్ ను కంట్రోలు చేయాలని డిసైడ్ చేసుకుని వెంటనే జగన్ కు హెచ్చరికలు జారీచేశారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉద్యమం అంటూ ఎక్కువ చేస్తే ఇబ్బందులు పడతావు జాగ్రత్త అంటూ కేంద్రంలోని కీలక నేత ఒకరి నుంచి జగన్ కు ఫోనొచ్చినట్లు చెబుతున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చేస్తే కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందని... హోదా ఇచ్చే అంశం తమ పరిశీలనలో ఇంకా ఉందని... ఆలోగా ఎలాంటి గొడవ చేయొద్దని చెబుతూ చేస్తే ఇబ్బందులు పడతావు జాగ్రత్త అంటూ కాస్త గట్టిగానే వార్నింగు ఇచ్చినట్లు సమాచారం. దీంతో జగన్ తోకముడిచారని తెలిసింది. ఇంతకీ వార్నింగ్ ఇచ్చిన నేత ఎవరంటే మాత్రం వైసీపీ నేతలు చెప్పడం లేదు. రాజకీయపండితులు మాత్రం అలాంటి వార్నింగ్ ఇవ్వగలిగింది రాజ్ నాథ్ మాత్రమేనని చెబుతున్నారు. జగన్ పై ఉన్న కేసుల నేపథ్యంలో రాజ్ నాథే వార్నింగ్ ఇచ్చారని పొలిటికల్ టాక్ నడుస్తోంది.