Begin typing your search above and press return to search.

చర్యలు మొదలు పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ.!

By:  Tupaki Desk   |   2 Jan 2022 5:49 AM GMT
చర్యలు మొదలు పెట్టాలని  రాష్ట్రాలకు కేంద్రం లేఖ.!
X
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, టర్కీ, అమెరికా లాంటి దేశాల్లో వైరస్ కేసులు లోడ్ అమాంతంగా పెరిగింది. పెరుగుతున్న కేసులు దృష్టిలో ఉంచుకొని వివిధ దేశాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. మరోవైపు వైరస్ కేసులు భారీగా వెలుగు చూస్తున్న దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి ఇప్పటికే పలు సూచనలు చేసింది. అమెరికా లో కేసుల సంఖ్య మిగతా దేశాలతో పోల్చితే భారీగా తగ్గింది. కానీ అధికారులు మాత్రం వైరస్ కట్టడి చర్యలు ఏమాత్రం తగ్గించడం లేదు.

మరో వైపు మన దేశంలో కూడా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది కాలంగా తగ్గుముఖం పట్టిన కేసులు.. తిరిగి మళ్లీ అదే స్థాయిలో పెరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే వైరస్ కేసులు అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ను చేపట్టారు. అంతేగాకుండా ప్రజలు కూడా వైరస్ ప్రోటోకాల్ ను పాటించాలని కోరింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ను ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, స్వచ్ఛందంగా టీకాలు తీసుకోవడం వంటివి చేయాలని కోరింది.

మరో వైపు వైరస్ కేసులు పెరుగుదలను అడ్డుకునే చర్యలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. భారత్ లో రెండో వేవ్ సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పింది. వీటితో పాటు భవిష్యత్ అవసరాలు తీర్చే దిశగా తాత్కాలిక ఆస్పత్రుల నిర్మించాలని కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేగాకుండా పెద్ద సంఖ్యలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. వీటి కోసం ఆయా రాష్ట్రాల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కోరింది. ఇందుకు సంబంధించిన సూచనలు పొందుపరుస్తూ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రశాంత్ భూషణ్ లేఖ రాశారు.

వైరస్ లక్షణాలను గుర్తించిన వెంటనే వారిని ఐసోలేషన్ కేంద్రాలుగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో లాగే వివిధ స్థాయిల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు కరోనా పరీక్షలను భారీగా పెంచాలని కోరారు. దీంతో వైరస్ కు చెక్ పెట్టవచ్చని తెలిపారు. మూడో వేవ్ ప్రారంభమైందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా పెంచాలన్నారు. వీలైనన్నీ బెడ్లు సిద్ధం చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటే కట్టడి చేయగలం అని చెప్పారు. ఈ మేరకు లేఖ రాశారు.