Begin typing your search above and press return to search.

రీజినల్ రింగ్ రోడ్డు తొలి గెజిట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   1 April 2022 4:56 AM GMT
రీజినల్ రింగ్ రోడ్డు తొలి గెజిట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X
హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలనే ప్రతిపాదనలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మొదటి అడుగు పడింది. రీజినల్ రింగ్ రోడ్డుకు ఉత్తర భాగానికి సంబంధించి తొలి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గెజిట్ నోటిఫికేషన్ ను ఆమోదిస్తూ సంతకం చేశారు.

ఈ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు భూసేకరణ కీలకం కానుంది. హైదరాబాద్ చుట్టూ నాలుగు జిల్లాల పరిధిలోని 15 మండలాల్లో 113 గ్రామాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగనుందని అధికారులు తెలిపారు. ఇందుకు మొత్తం 1901 హెక్టార్ల భూమి అవసరమని గెజిట్ లో పొందుపరిచారు.ఈ ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డి వద్ద ప్రారంభమై చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది.

సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎట్టకేలకు తెలంగాణకు మణిహారంగా రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డును కేంద్రం నుంచి మంజూరు చేయించారు. ప్రస్తుతమున్న ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న దీనికి జాతీయ హోదాను కట్టబెట్టుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు అయ్యే ఖర్చు ఎంత? ఎక్కడి నుంచి ఎక్కడికి దీన్ని ఏర్పాటు చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది.

ఈరోడ్డు పూర్తయితే హైదరాబాద్ పరిధి చాలా విస్తరిస్తుంది. కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తాయి. వివిధ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు పరిశ్రమలు, అభివృద్ధి విస్తరిస్తుంది.హైదరాబాద్ కు ఆవల మొత్తం 338 కిలోమీటర్ల పొడువు నిర్మాణంతో ఈ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. తుఫ్రాన్, గజ్వేల్, జగదేవ్ పూర్, తుర్కపల్లి, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపూర్, యాచారం, షాద్ నగర్, పరిగి , పూడూరు, చేవెళ్ల, శంకర్ పల్లి మండలాల మీదుగా ఈ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ వెళుతుంది.

ప్రస్తుతం ఉత్తర దిశలో ఉన్న చౌటుప్పల్-సంగారెడ్డి మధ్య 182 కి.మీల మేర నిర్మాణం చేపట్టనున్నారు. రెండు దశలకు కలిపి 17వేల కోట్లు హైదరాబాద్ కోసం కేంద్రం ఖర్చు చేయనుంది.. హైదరాబాద్ కు వచ్చే అన్ని హైవేలను ఇది కలుపుతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ భూసేకరణ పనులను మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని కిషన్ రెడ్డి కోరారు. ఖరీదైన భూములను సేకరించడం అంత ఈజీ కాకపోవడంతో ఈ బాధ్యతను కేసీఆర్ సర్కార్ పై పెట్టారు. దీంతో అసలు భూసేకరణ కష్టమన్న ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్ నగరానికి 50 నుంచి 70కి.మీల దూరంలో ఓఆర్ఆర్ కి 30కి.మీల దూరంలో ఈ రహదారి నిర్మాణం జరుగనుంది.సుమారు 20కిపైగా ముఖ్యనగరాలు, పట్టణాలను కలుపుతూ నిర్మాణం జరుగనున్న ఈ రహదారితో 40శాతం మంది ప్రజలకు రింగురోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.