Begin typing your search above and press return to search.

ఏపీకి మ‌రో దెబ్బేసిన కేంద్రం!

By:  Tupaki Desk   |   19 Aug 2018 5:11 AM GMT
ఏపీకి మ‌రో దెబ్బేసిన కేంద్రం!
X
పుట్టెడు ఆర్థిక క‌ష్టాల‌తో కిందా మీదా ప‌డుతోంది ఏపీ. విభ‌జ‌న కార‌ణంగా నిధుల లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఏపీకి కేంద్రం అండ అవ‌స‌రం. అయితే.. రాజ‌కీయంగా ఉన్న విభేదాల‌తో మిత్రుడైన మోడీ స‌ర్కారును ప్ర‌త్య‌ర్థిగా మార్చుకున్న బాబు కార‌ణంగా.. ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల‌కు త‌న‌దైన శైలిలో చెక్ పెడుతోంది మోడీ స‌ర్కార్. తాజాగా అలాంటి షాకే మ‌రొక‌టి ఇచ్చింది.

అదేమైనా అంటే.. మేం మొద‌ట్నించి చెబుతున్నాం.. త‌ప్పు మాది కాద‌న్న ద‌బాయింపుతో ఏపీ రాష్ట్రానికి నోట‌మాట రాని ప‌రిస్థితి. రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్న వాట‌ర్ షెడ్ల‌కు కేంద్రం అందించే ఆర్థిక సాయాన్ని ఆపేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో.. నీటి సంర‌క్ష‌ణ‌.. పొదుపు కోసం అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌కు అవ‌స‌ర‌మ‌య్యే నిదుల్ని ఇక‌పై రాష్ట్ర‌మే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాదు.. ఈ ప‌థ‌కంలో భాగంగా నియ‌మించుకున్న అధికారుల జీతభ‌త్యాల భారం కూడా రాష్ట్ర స‌ర్కారు మీదే ప‌డ‌నుంది. దేశ వ్యాప్తంగా అమ‌ల‌వుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీలో స‌త్ఫ‌లితాలు ఇస్తోంది. ఇలాంటివేళ‌.. ఈ ప‌థ‌కం కింద ఇచ్చే నిధుల‌ను ఇవ్వ‌మ‌ని చెప్ప‌టంతో రాష్ట్రంపై కొత్త ఆర్థిక భారం ప‌డ‌నుంది. ఏడాది క్రిత‌మే కొత్త వాట‌ర్ షెడ్ల మంజూరును నిలిపివేస్తామ‌ని కేంద్రం హెచ్చ‌రించింది.

ఈ నేప‌థ్యంలో కేంద్రంతో తాజాగా న‌డుస్తున్న త‌గువు నేప‌థ్యంలో ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవ‌టంలో రాష్ట్ర స‌ర్కారు విఫ‌ల‌మైంద‌న్న మాట వినిపిస్తోంది. తాము ఆర్థిక సాయాన్ని ఇక‌పై ఇవ్వ‌మ‌ని తేల్చి చెప్పిన నేప‌థ్యంలో.. ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన నిధుల‌తో పాటు.. సిబ్బంది జీతాల భారం రాష్ట్రంపై ప‌డ‌నుంది. ఇప్ప‌టికే ఆర్థిక క‌ష్టాల‌తో కిందామీదా ప‌డుతున్న ఏపీకి.. తాజా నిర్ణ‌యం ఆర్థికంగా మ‌రింత ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.