Begin typing your search above and press return to search.

పుల్వామా ఘ‌ట‌న‌పై స్టార్ల ఆగ్ర‌హం

By:  Tupaki Desk   |   15 Feb 2019 10:51 AM GMT
పుల్వామా ఘ‌ట‌న‌పై స్టార్ల ఆగ్ర‌హం
X
కశ్మీర్ - పుల్వామాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదుల అమానుష దాడి 40 మంది జవాన్ల‌ను పొట్ట‌న పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దారుణంపై సెల‌బ్రిటీలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అటు బాలీవుడ్ తో పాటుగా, ఇటు టాలీవుడ్ హీరోలు, న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సోషల్ మీడియా వేదికగా ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు. కొంద‌రు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. తీవ్ర‌వాదుల్ని చంపేయాల‌న్నంత క‌సిని వ్య‌క్తం చేశారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరో సూర్య‌, పూరి జ‌గ‌న్నాథ్, స‌ల్మాన్ ఖాన్, బిగ్ బి అమితాబ్ వంటి స్టార్లు సామాజిక మాధ్య‌మాల్లో ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. దేశ భ‌ద్ర‌త‌కు ఉన్న స‌వాల్ ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేయ‌డ‌మే గాక మ‌ర‌ణించిన అమ‌ర జ‌వాన్ల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. ద‌ర్శ‌కుడు పూరి ట్వీట్ చేస్తూ ``మరో సర్జికల్ స్ట్రయిక్ కావాలని.. వారిని చంపేయండి``అంటూ ట్వీట్ చేశారు. ``పుల్వామా ఘ‌ట‌న విన్న త‌ర్వాత తీవ్రంగా క‌ల‌త‌కు గుర‌య్యాను. సైనికుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను`` అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు. ``42 మంది జ‌వాన్లు ప్రాణాళు కోల్పోయారు. ప్ర‌తి జ‌వాన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటాం. వారికి గౌర‌వ‌వంద‌నాలు అర్పిస్తున్నాను. వెరీ వెరీ శాడ్ డే.. హృద‌యపూర్వ‌కంగా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను`` అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ``మన జ‌వాన్ల‌కు ఎక్కడా రక్షణ లేదు. ఈ దాడి ఎంతో బాధకి గురి చేస్తోంది. దీనికి కారకులైన వారికి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను`` అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ``జవాన్ల పై ఇంత దారుణం జరిగిందని తెలిసి చాలా బాధపడ్డాను. వారి కుటుంబాలకు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను`` అంటూ సూర్య సోష‌ల్ మీడియాలో స్పందించారు.

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ సైతం సానుభూతిని వ్య‌క్తం చేశారు. ``మన కుటుంబాలను కాపాడటానికి నిరంత‌రం గ‌స్తీ కాసే జ‌వాన్ల ప్రాణ త్యాగం చూస్తుంటే గుండె బద్దలవుతోంది`` అంటూ ట్వీట్ చేశారు. ``ప్రేమికుల రోజున ఇంత దారుణానికి ఒడిగట్టారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా సంతాపం`` అని అన్నారు బిగ్ బి. ``ద్వేషం ఎప్పటికీ సమాధానం కాదని`` ప్రియాంక చోప్రా సోష‌ల్ మీడియాలో స్పందించారు. ``రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు. ఏ మాత్రం సహించకూడదని`` రితేష్ దేశ్ ముఖ్ కోపాన్ని వ్య‌క్తం చేశారు. ``జవాన్ల ప్రాణాలు తీసి వారి కుటుంబాలకు బాధను మిగిల్చిన వారిని క్షమించకూడ‌దు.. అని సోనూసూద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక ప‌లువురు సినీరాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు అన్ని సెక్ష‌న్ల నుంచి సామాజిక మాధ్య‌మాల్లో దాడిపై ఖండ‌న వ్య‌క్త‌మైంది. జ‌వాన్ల కుటుంబాల‌పై పెద్ద ఎత్తున సానుభూతిని వ్య‌క్తం చేశారు.