Begin typing your search above and press return to search.

అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకండి : యూఎస్ గర్భిణీలకు సీడీసీ హెచ్చరిక !

By:  Tupaki Desk   |   1 Oct 2021 5:31 AM GMT
అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకండి : యూఎస్ గర్భిణీలకు సీడీసీ హెచ్చరిక !
X
కరోనా మహమ్మారి దెబ్బకి గత కొన్ని నెలలుగా ఎన్నో దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇంకా అక్కడ వైరస్ ప్రభావం పూర్తిగా తప్పలేదు. గత నెలలో కూడా భారీ సంఖ్యలో కొత్త కేసులు, కరోనా వైరస్ మరణాలు ఎక్కువగానే నమోదయ్యాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒకటే మార్గం అయినప్పటికీ కూడా వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ప్రజలు అశ్రద్ధ చూపడంతోనే మహమ్మారిని నిరోధించడం సాధ్యపడటం లేదని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. టీకాలపై అపోహలతో ఇప్పటికీ చాలా మంది వాటిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదని వాపోతున్నారు.

చాలాసార్లు ఎన్నో కార్యక్రమాల ద్వారా వ్యాక్సిన్లపై అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతుందట. ఇక గర్భిణీలు టీకాలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలియడంతో తాజాగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వారికి అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఒకవేళ గర్భిణీలు కరోనా బారిన పడినా వారు అంతకుముందే వ్యాక్సిన్ తీసుకుని ఉంటే వైరస్ సంబంధిత ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చని పేర్కొంది. అలాగే వారికి పుట్టబోయే బిడ్డకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని సీడీసీ స్పష్టం చేసింది. ఆగస్టులో 22 మంది గర్భిణీ స్త్రీలు కరోనాతో మరణించారని ఏజెన్సీ తెలిపింది.

ఇది మహమ్మారి వల్ల నమోదైన అత్యధిక నెలవారీ మరణాల సంఖ్యగా పేర్కొంది. సాధారణ స్త్రీల కంటే గర్భిణీలకు వైరస్ సోకితే మరణించే ప్రమాదం 70 శాతం ఎక్కువ అని సీడీసీ డేటా చెబుతోంది. అలాగే గర్భిణీలు ఒకవేళ వైరస్ బారిన పడితే.. తప్పనిసరిగా ఐసీయూలో చేరాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన గర్భిణీల్లో 97 శాతం మంది టీకా తీసుకోని వారేనని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 31 శాతం మంది గర్భిణీలు మాత్రమే వ్యాక్సిన్లు వేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీడీసీ కీలక సూచన చేసింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్నవారు, గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న వారితో పాటు ఇప్పుడే శిశువును జన్మనిచ్చిన వారు కూడా తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలని కోరింది. లేనిపక్షంలో చేజేతులా మృత్యువుని ఆహ్వానించినట్టేనని అని వెల్లడించింది.